రైతులపై కేంద్రం నిర్లక్ష్యం విచారకరం: మాయావతి
ABN , First Publish Date - 2021-07-18T20:23:34+05:30 IST
నూతన సాగు చట్టాల రద్దు కోసం రైతులు చేస్తున్న ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ సాచివేత ధోరణ...
న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాల రద్దు కోసం రైతులు చేస్తున్న ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ సాచివేత ధోరణ విచారకరమని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. కేంద్ర ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిలదీయడంలో అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తమ పార్టీ పలు అంశాలను ఉభయసభల్లోనూ లేవనెత్తుతుందని చెప్పారు. ఇంధనం, ఎల్పీజీ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండటం, ద్రవ్యోల్బణం, కోవిడ్ వ్యాక్సినేషన్ వంటి అంశాలను తమ పార్టీ ప్రస్తావిస్తుందని తెలిపారు. ఈమేరకు పార్టీ ఎంపీలకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు.
బ్రాహ్మణులు ఈసారి బీజేపీకి ఓటేయరు..
రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం బీజేపీకి ఓటు వేయదని తాను బలంగా విశ్వసిస్తున్నట్టు మాయావతి తెలిపారు. దీనిపై బీఎస్పీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా సారథ్యంలో ఈనెల 23 నుంచి అయోధ్యలో ప్రచారం చేపట్టునున్నట్టు చెప్పారు. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కలుసుకుని, బీఎస్పీ పాలనలోనే వారి ప్రయోజనాల పరిరక్షణ జరుగుతుందనే భరోసాను తాము కల్పించనున్నట్టు మాయావతి చెప్పారు.