ఆస్పత్రికి అనాథ వృద్ధుడు
ABN , First Publish Date - 2021-10-17T05:03:32+05:30 IST
నంద్యాల బైర్మల్ వీధిలో చిన్నాస్పత్రి ఎదురుగా ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో రెండు రోజుల నుంచి తిండిలేక నీరసపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ వృద్ధుడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు.
నంద్యాల టౌన్, అక్టోబరు 16: నంద్యాల బైర్మల్ వీధిలో చిన్నాస్పత్రి ఎదురుగా ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో రెండు రోజుల నుంచి తిండిలేక నీరసపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ వృద్ధుడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. శుక్రవారం రాత్రి అటువైపుగా వెళ్తున్న వార్డు టీడీపీ ఇన్చార్జి బుజ్జి వృద్ధుడి పరిస్థితిని గమనించారు. వెంటనే ఆసరా సొసైటీ అధ్యక్షుడు షేక్ బాబాఫకృద్దీన్, ఫలాహ్ ఫౌండేషన్ సభ్యులు మాలిక్, సల్మాన్, దేవాలయ పరిరక్షణ సమితి సభ్యులు కిరణ్కుమార్, మార్వాడి ప్రకాష్లకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న మిత్రులంతా కలిసి వృద్ధుడి సమాచారాన్ని రాబట్టారు. తన స్వస్థలం కడప జిల్లా జమ్మలమడుగు అని, తనకు ఎవరూ లేరని, రెండు రోజుల నుంచి తీవ్ర జ్వరం, కాళ్ల నొప్పులతో ఎటూ కదల్లేకపోతున్నానని చెప్పాడు. స్పందించిన మిత్ర బృందం 108 అంబులెన్స్కు ఫోన్ చేసి పిలిపించి వృద్ధుడిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించింది. మిత్ర బృందాన్ని స్థానికులు అభినందించారు.