బాలుకు ఓరుగల్లు నివాళి
ABN , First Publish Date - 2020-09-26T10:17:06+05:30 IST
గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యంకు ఓరుగల్లు అన్నా, ఇక్కడి కళాకారులన్నా ఎనలేని అభిమానం. నగరానికి ఆయన దాదాపు
శోకసముద్రంలో వరంగల్ కళాకారులు
నగరానికి పలుమార్లు వచ్చిన బాలసుబ్రహ్మణ్యం
వివిధ కార్యక్రమాలకు హాజరు
పలువురు కళాకారులకు చేయూత
ప్రముఖ సినీ గాయకుడు, సంగీతదర్శకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపై వరంగల్ ప్రజలు దిగ్ర్భాంతికి లోనయ్యారు. శోకసముద్రంలో మునిగిపోయారు. కళాలోకం కన్నీరుమున్నీరైంది. బాలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు కళాకారులు విచారగ్రస్తులయ్యారు. బాలు ఇక లేడన్న వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమను ఆప్యాయంగా వెన్నుతట్టి ప్రోత్సహించిన క్షణాలు తలుచుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన లేకున్నా.. ఆయన పాటలు ఆయనను సజీవంగా ఉంచుతాయని నివాళులర్పించారు.
వరంగల్ కల్చరల్, సెప్టెంబరు 25: గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యంకు ఓరుగల్లు అన్నా, ఇక్కడి కళాకారులన్నా ఎనలేని అభిమానం. నగరానికి ఆయన దాదాపు డజన్సార్లు వచ్చారు. వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. 1990 దశకంలో వరంగల్ ఆర్ఈసీ (ఇప్పుడు నిట్)లో కాకతీయ ఆర్ట్ థియేటర్ ఇంటర్నేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీగేయ రచయిత డాక్టర్ సి.నారాయణ రెడ్డి, ప్రపంచప్రఖ్యాత ధ్వన్యనుకరణ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్తో పాటు బాలసుబ్రహ్మణ్యంను ఘనంగా సత్కరించారు. అప్పటి యుజవన వ్యవహారాల శాఖ మంత్రి ప్రణయ్భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై బాలసుబ్రహ్మణ్యంకు భారీ జ్ఞాపిక, రూ.25వేల నగదుతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలోనే గట్టు మహే్షబాబు బాలుకు బంగారు ఉంగరాన్ని బహూకరించారు. ఈ సత్కారాన్ని అందుకోవడానికి బాలు వరంగల్ నగరానికి రావడం అదే మొదటిసారి. ఆ తర్వాత పలు సందర్భాల్లో నగరాన్ని ఆయన సందర్శించారు. నందనగార్డెన్లో నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. అంబేద్కర్ భవన్లో జరిగిన పాడుతా తీయగా సెమీఫైనల్లో కూడా బాలు పాల్గొన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీలో జరిగిన స్వరాభిషేకంలో పాల్గొని ఓరుగల్లు ప్రజలకు తన గానామృతాన్ని పంచారు.
దయార్థ హృదయుడు
ఓరుగల్లు కళాకారుడు, గాయకుడు ధీకొండ సారంగపాణి రైలు ప్రమాదంలో మృతి చెందిన సంఘటనతో దిగ్ర్బాంతికి లోనైన బాలు.. ఆయన కుటుంబానికి రూ.10వేల ఆర్ధిక సహాయాన్ని చెక్కు రూపంలో పంపించారు. అంతేకాకుండా సారంగపాణి పేదకళాకారుడని తెలుసుకున్న బాలసుబ్రమణ్యం.. ఆయన కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు వరంగల్ కళాకారులు చేపట్టిన నిధుల సమీకరణ కార్యక్రమంలో భాగంగా సెయింట్ ఫీటర్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో ఉచితంగా పాల్గొన్నారు.
స్ఫూర్తిప్రదాత
వరంగల్కు చెందిన ఎందరో వర్ధమాన గాయకులకు బా లు ప్రోత్సహించారు. వరంగల్కు చెందిన గాయని గోల్కొండ సుహిత పాటల ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి చేయూతనిచ్చారు. సుహిత పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బాలు ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించారు. వరంగల్ సినీ నిర్మాత శ్యామల గణేష్ తీసిన రెండు సినిమాల్లో బాలు పాటలు పాడారు. హన్మకొండకు చెందిన సినీ గేయ రచయిత, గాయకుడు కాసర్ల శ్యామ్ ను సైతం వెన్నుతట్టి ప్రోత్సహించారు. హైదరాబాద్ వేదిక జరిగిన పలు పాటల పోటీ కార్యక్రమాల్లో పాల్గొన్న వరంగల్ వర్ధమాన గాయకులను న్యాయనిర్ణేతగా హాజరైన బాలు అభినందించడం ద్వారా వారిలో స్ఫూర్తి నింపారు.
పలువురి సంతాపం
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల వరంగల్ కళాలోకం ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. ఆయన కుటుంబసభ్యులకు సా నుభూతిని తెలియచేసింది. బాలు మృతి పట్ల జూనియర్ ఘంటసాల గుజ్జారి రమేష్ సంతాపాన్ని తెలియచేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు.. భారతీయ ప్రజలందరి హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. ప్రముఖ కళాకారుడు బూర విద్యాసాగర్ కూడా బాలు మరణం పట్ల విచారం ప్రకటించారు. ఆయన సంగీత ప్రపంచంలో ఆణిముత్యంగా అభివర్ణించారు. పాట ల పూదోటలో బాలు పూయించిన ఎన్నో పుష్పాల సుమధురం ఎప్పటికీ పరిమళిస్తూనే ఉంటుందన్నారు.
రాష్ట్ర సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణ ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతికి దిగ్ర్బాంతిని విచారాన్ని వ్యక్తం చేశారు. బాలు మృతితో సంగీత ప్రపంచం ఒక సుమధురగాయకుడిని కోల్పోయిందన్నారు. బాలులేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సేవలందించిన గొప్ప వ్యక్తి బాలు అని అంజలి ఘటించారు. సంగీత దర్శకుడు మల్లిక్ బాలు ముృతికి సంతాపం ప్రకటిస్తూ 2005లో తన మొదటి సంగీత దర్శకత్వంలో మొదటిపాట పాడి తనను ఆశీర్వదించిన గొప్ప మనసున్న మంచి మనిషి అని ప్రశంసించారు. నువ్వు ఇలానే మంచి బాణీలు చేస్తే సినిమా రంగంలో మంచి పేరు వస్తుందని తనతో అన్న మాటలు ఇంకా గుర్తున్నాయన్నారు. ఆయన మాటలే స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమలో ఒక మంచి సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నానన్నారు. బాలు లేని తెలుగు పాటను ఊహించుకోవడం కష్టం అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి విచారం
గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు సంతాపాన్ని ప్రకటించారు. ఎస్పీ బాలు మ రణం అత్యంత బాధాకరమని అన్నారు. పాటల ప్రపంచం లో ఆయన గానగంధర్వుడుగా అభివర్ణించారు. ఆయన మ రణం యావత్తు దేశానికి, పాటల ప్రియులకు తీరని లోటు అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షించారు.