ప్రాణంమీదకు ‘ఓటీఎస్’
ABN , First Publish Date - 2021-12-06T07:43:35+05:30 IST
ప్రాణంమీదకు ‘ఓటీఎస్’
కుమారుడి వైద్యం కోసం ‘పొదుపు’ నుంచి రుణం
బలవంతంగా జమచేసుకున్న సచివాలయ ఉద్యోగులు
చికిత్సకు డబ్బు లేదంటూ తల్లిదండ్రుల ఆవేదన
బొబ్బిలి రూరల్, డిసెంబరు 5: పేదల ఇళ్లకు వన్టైమ్ సెటిల్మెంట్ పథకం (ఓటీఎస్) స్వచ్ఛందమేనని, ఒత్తిడి లేదని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. ఎప్పుడో కట్టుకున్న ఇళ్ల బకాయిలు కట్టాల్సిందేనని అధికారులు వేధింపులకు దిగుతున్నారు. కుటుంబ పరిస్థితి బాగాలేదని, సొమ్ము చెల్లించలేమని లబ్ధిదారులు కాళ్లావేళ్లా పడినా వినడం లేదు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న కుమారుడికి వైద్యం కోసం తీసుకున్న రుణం సొమ్మును కూడా బలవంతంగా ఓటీఎస్కు జమ చేసుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఈ సంఘటన జరిగింది. రెడ్డిక వీధికి చెందిన పొట్నూరు బుల్లెమ్మ అనే వృద్ధురాలి పేరిట గతంలో ఇల్లు మంజూరైంది. ఆమె ఆరు నెలల కిందట అనారోగ్యంతో మృతిచెందింది. ఆ ఇంట్లో ఆమె కుమారుడు శ్రీనివాసరావు కుటుంబంతో నివాసముంటున్నాడు. శ్రీనివాసరావు కుమారుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విశాఖలోని ఆస్పత్రిలో అత్యవసర వైద్యం చేయాల్సి ఉంది. పది రోజుల కిందట ఓటీఎ్సకు రూ.15 వేలు చెల్లించాలంటూ సచివాలయ ఉద్యోగులు ఆయనకు నోటీసులిచ్చారు. తాను నిరుపేదనని, ప్రస్తుత పరిస్థితుల్లో అంత కట్టలేనని చెప్పినా వారు వినలేదు. కుమారుడికి చికిత్స చేయించేందుకు శ్రీనివాసరావు భార్య భారతి పొదుపు సొమ్ము నుంచి రుణంతీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి చేసి ఆ సొమ్మును ఓటీఎ్సకు జమ చేసుకున్నారు. దీంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ కుమారుడికి వైద్యం చేయించేది ఎలాగని, తమకు దిక్కెవరంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.