టిఫిన్ చేస్తుండగా OU Student Leader అరెస్ట్.. ఎక్కడికి తరలించారో..!?
ABN , First Publish Date - 2021-10-02T15:30:54+05:30 IST
ఓయూ తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్) నాయకుడు...
హైదరాబాద్ సిటీ/ఉప్పల్ : ఓయూ తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్) నాయకుడు కోట శ్రీనివాస్ను రాచకొండ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం విద్యానగర్ ఎన్సీసీ-శివం రోడ్డులో ఓ టిఫిన్ సెంటర్ వద్ద శ్రీనివాస్ అల్పాహారం తీసుకుంటున్న సమయంలో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన సింగరేణి ఉద్యోగి అయిన స్నేహితుడితో కలిసి ఆయన టిఫిన్ చేస్తుండగా మఫ్టీలో ఉన్న టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ స్నేహితుడు తప్పించుకొని అరెస్టు విషయాన్ని ఫేస్బుక్లో పోస్టు చేశారు. శ్రీనివాస్ అరెస్టును పౌరహక్కుల సంఘం నాయకులతో పాటు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ఎన్ శంకర్ తీవ్రంగా ఖండించారు.
ఆయనను ఎందుకు, ఏ కేసులో అరెస్టు చేశారో, ఎక్కడికి తరలించారో ప్రభుత్వం వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ను తాము అరెస్ట్ చేయలేదని ఓయూ ఇన్స్పెక్టర్ రమేశ్ నాయక్ చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్కు చెందిన శ్రీనివాస్.. ఓయూలో పొలిటికల్ సైన్స్లో పీహెచ్డీ చేస్తూ క్యాంప్సలోని ఎన్ఆర్ఎస్ హాస్టల్లో ఉంటున్నాడు. అప్పట్లో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ఎన్కౌంటర్ బాధిత కుటుంబాలకు సంబంధించి ఓయూలోని కొన్ని విద్యార్థి సంఘాలతో కలిసి నిజనిర్ధారణ కోసం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో శ్రీనివాస్ చురుకుగా వ్యవహరించినట్లు ఓయూలోని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు.