18 నెలల్లో 3 లక్షల సైబర్ నేరాలు..

ABN , First Publish Date - 2021-03-09T21:58:31+05:30 IST

గడచిన 18 నెలల్లో దేశవ్యాప్తంగా 3,17,439 సైబర్ నేరాలు చోటుచేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో వెల్లడించింది.

18 నెలల్లో 3 లక్షల సైబర్ నేరాలు..

న్యూఢిల్లీ: గడచిన 18 నెలల్లో దేశవ్యాప్తంగా 3,17,439 సైబర్ నేరాలు చోటుచేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో వెల్లడించింది. అదే సమయంలో సైబర్ నేరగాళ్లపై 5,771 ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్టు తెలిపింది. అత్యధిక సైబర్ నేరాలు చోటుచేసుకున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్నాటక ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. అన్ని రకాల సైబర్ నేరాలపై పౌరులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు వీలుగా కేంద్ర హోంశాఖ 2019 ఆగస్టు 30 నుంచి ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ను నిర్వహిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేకించి మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న దురాగతాలను అడ్డుకోవడమే లక్ష్యంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు. ‘‘అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి 3,17,439 సైబర్ నేరాలు, 5,771 ఎఫ్ఐఆర్ ‌లు నమోదయ్యాయి. ఇందులో కర్నాటకలో 21,562 వరకు సైబర్ నేరాలు, 87 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. మహారాష్ర్టలో 50,806 సైబర్ మోసాలు జరగ్గా... 534 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి...’’ అని కిషన్ రెడ్డి వెల్లడించారు. 

Updated Date - 2021-03-09T21:58:31+05:30 IST