5 లక్షలకుపైగా హాజరు

ABN , First Publish Date - 2020-09-21T07:46:53+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5,06,308

5 లక్షలకుపైగా హాజరు

సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు ప్రారంభం

కరోనా, వర్షాల దృష్ట్యా తగ్గిన హాజరు

ఐసొలేషన్‌ కేంద్రాల్లో 634 మందికి పరీక్ష

డిజిటల్‌ అసిస్టెంట్‌కు  ఇంజనీరింగ్‌ సిలబ్‌సలో ఎక్కువ ప్రశ్నలు

బీకాం కంప్యూటర్స్‌ చదివిన  అభ్యర్థులకు ఇబ్బందులు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5,06,308 మంది పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 4.56 లక్షల మందికిగాను 3,40,386 మంది(74.48ు) పరీక్షలు రాశారు. వీరికి 2,221 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1059 పరీక్షాకేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 2.24 లక్షలమందికిగాను 1,65,922 మంది(73.85ు) హాజరయ్యారు.


వెల్ఫేర్‌, ఎడ్యుకేషనల్‌, వార్డు అడ్మినిస్ట్రేషన్‌, మహిళా పోలీసు, డిజిటల్‌ అసిస్టెంట్‌, పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ఈ పరీక్షలు నిర్వహించారు. డిజిటల్‌ అసిస్టెంట్‌ పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు ఇంజనీరింగ్‌ సిలబస్‌ నుంచి ఇవ్వడంతో బీకాం కంప్యూటర్స్‌ పూర్తి చేసిన అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. 


ఉదయం అత్యధికంగా విశాఖ జిల్లాలో 77.04 శాతం, అత్యల్పంగా గుంటూరు జిల్లాలో 70.31 శాతం మంది హాజరయ్యారు. మధ్యాహ్నం కడప జిల్లాలో అత్యధికంగా 76.01 శాతం, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 70.56 శాతం మంది పరీక్షలు రాశారు. కొవిడ్‌తోపాటు  వర్షాలు కూడా అభ్యర్థుల హాజరు తగ్గడానికి కారణాలుగా అధికార యంత్రాంగం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 634 మంది కొవిడ్‌ బాధితులకు ప్రత్యేక ఐసొలేషన్‌ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వీరిలో పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కువమంది ఉన్నారు. 


నేడు కేటగిరీ-2ఏ, 2బీ పరీక్షలు

సోమవారం ఉదయం కేటగిరీ-2బీ(వీఆర్వో/విలేజ్‌ సర్వేయర్‌), మధ్యాహ్నం కేటగిరీ-2ఏ(ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌/వార్డుఅమెనిటీస్‌సెక్రటరీ) పోస్టులకు పరీక్షలు.




పకడ్బందీగా పరీక్షలు: పెద్దిరెడ్డి


సచివాలయ ఉద్యోగాలకు  పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నామని పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. తిరుపతిలో పరీక్షల తీరును ఆయన పరిశీలించారు. కొవిడ్‌ దృష్ట్యా అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు సచివాలయ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. టీటీడీ డిక్లరేషన్‌ వివాదంపై మీడియా ప్రశ్నించగా.. గతంలో సీఎం హోదాలో వైఎస్‌ కూడా డిక్లరేషన్‌ ఇవ్వలేదన్నారు.  దీనిని వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. 


Updated Date - 2020-09-21T07:46:53+05:30 IST