Karnataka : కోతుల్ని ఘోరాతి ఘోరంగా చంపేశారు..

ABN , First Publish Date - 2021-07-30T01:04:37+05:30 IST

హృదయం బండగా మారిందంటే ఇదే. మనుషుల్లో సున్నితత్వం తగ్గిందో, క్రూరత్వం పెరిగిందో కానీ... మూగ జీవాల పట్ల కూడా జాలి

Karnataka : కోతుల్ని ఘోరాతి ఘోరంగా చంపేశారు..

బెంగళూరు : హృదయం బండగా మారిందంటే ఇదే. మనుషుల్లో సున్నితత్వం తగ్గిందో, క్రూరత్వం పెరిగిందో కానీ... మూగ జీవాల పట్ల కూడా జాలి చూపించడం లేదు. జాలి చూపించకపోగా... వాటిపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కర్నాటకలోని హసన్ జిల్లాలో కొందరు బరితెగించి ప్రవర్తించారు. కోతులకు విషం పెట్టి, పైగా గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. దీంతో 36 కోతులు మరణించాయి. హసన్ జిల్లాలోని చౌడనహళ్లి సమీపంలోని ఓ రోడ్డు పక్కన ఈ ఘటన జరిగింది. చౌడనహళ్లి గ్రామస్థులు ఉదయం ఓ గోనె సంచిని చూశారు. ఏముందో అని తెరిస్తే, అందులో కోతులు విగత జీవులుగా కనిపించాయి. కొన్ని కోతులు మరణించాయి. కొన్ని అపస్మారకంగా పడి ఉన్నాయి. ఆ సంచిలో 50 కోతులుండగా, 36 కోతులు మరణించాయి. అపస్మారకంగా ఉండిపోయిన కోతులను గ్రామస్థులు బయటికి తీసి, నీరు తాగించారు. ఆ తర్వాత ఆస్పత్రికి కూడా తీసుకెళ్లారు. స్థానికులు ఈ విషయాన్ని అటవీ అధికారులకు చేరవేశారు. దీంతో అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.


కోతులకు విషం పెట్టడం కాకుండా, ఓ గోనె సంచిలో కుక్కి, ఘోరాతి ఘోరంగా కొట్టారని ప్రాథమిక నివేదికలో తేలింది. ఈ విషయంపై డిప్యూటీ కన్జర్వేటర్ అధికారి మాట్లాడుతూ... ‘‘దగ్గర్లో ఉన్న బేలూర్, సక్లేష్ పూర్‌లోనూ కోతులున్నాయి. కానీ వాటికి వచ్చే నష్టమేమీ లేదు. స్థానికులు వాటికి ప్రాణ నష్టాన్ని కలిగించరు. వాటి శరీర భాగాలను క్షుణ్ణంగా పరిశీలించాం. స్థానిక ఘాట్‌లలో ఉండేవిగా మాకు అనిపించడం లేదు. వాటి బొచ్చు కూడా చాలా సన్నగా ఉంది. వేరే ప్రాంతంలో ఇలాంటి అఘాయిత్యం చేసి ఇక్కడ పడేసి ఉంటారని మేం భావిస్తున్నాం’’ అని ఆ అధికారి వివరించారు. 

Updated Date - 2021-07-30T01:04:37+05:30 IST