అరిజోనా జైలులో 500 మందికి పైగా ఖైదీలకు కరోనా !
ABN , First Publish Date - 2020-08-06T19:32:27+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా వైరస్ గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
అరిజోనా: అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా వైరస్ గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అరిజోనా రాష్ట్రంలోని ఓ జైలులో ఏకంగా 500 మందికి పైగా ఖైదీలకు కోవిడ్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఎఎస్పీసీ-టక్సన్ వీట్స్టోన్ జైలులో 517 మందికి కరోనా పాజిటివ్గా వచ్చిందని అరిజోనా డిపార్ట్మెంట్ ఆఫ్ ది కరెక్షన్స్, రిహాబిలిటేషన్ అండ్ రీఎంట్రీ(ఏడీసీఆర్ఆర్) తెలిపింది. దీంతో బాధితులను ప్రత్యేక గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. వారు పూర్తిగా కోలుకునేంత వరకు మిగతా ఖైదీలతో కలిసేందుకు అనుమతి ఇవ్వబోమని అధికారులు తెలియజేశారు. కాగా, వీట్స్టోన్ యూనిట్లో ప్రస్తుతం 1,066 మంది ఖైదీలు ఉన్నారు.
ఇక యూఎస్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో అరిజోనా కూడా ఒకటి. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో 1,82,203 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 3,932 మందిని ఈ మహమ్మారి బలిగొంది. అలాగే అమెరికా వ్యాప్తంగా మొత్తం 49.70 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 1.60 లక్షల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాజిటివ్ కేసులు, మరణాల్లో అగ్రరాజ్యం అగ్రస్థానంలో కొనసాగుతోంది.