Afghanistan:దేశంలో మూడింతలు పెరిగిన క్షతగాత్రుల సంఖ్య

ABN , First Publish Date - 2021-08-19T13:40:17+05:30 IST

అఫ్ఘానిస్థాన్ దేశంలో ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది....

Afghanistan:దేశంలో మూడింతలు పెరిగిన క్షతగాత్రుల సంఖ్య

ఆరోగ్య పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన

కాబూల్ : అఫ్ఘానిస్థాన్ దేశంలో ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో తాలిబాన్ల రాకతో హింస తీవ్రమైన నేపథ్యంలో 14వేల మంది గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. గతంలో ఏడాది కాలంలో 4,057 క్షతగాత్రుల కేసులు నమోదు కాగా, తాలిబాన్ల దాడులతో క్షతగాత్రుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. తాలిబాన్లు అఫ్ఘాన్ భద్రతా దళాలు, పౌరులపై చేసిన దాడులతో క్షతగాత్రుల సంఖ్య పెరిగింది. 


క్షతగాత్రులకు వైద్యం అందించడంలో మానవతా దృక్పథంతో అంతరాయం కలిగించకూడదని డబ్ల్యూహెచ్‌వో తూర్పు మధ్యధరా ప్రాంతానికి చెందిన ప్రాంతీయ డైరెక్టరు డాక్టర్ అహ్మద్ అల్ మందారి కోరారు.కొవిడ్ మహమ్మారి వల్ల వైద్య సామాగ్రి కొరత ఏర్పడిన అఫ్ఘానిస్థాన్ దేశంలో హింస మరింత ప్రభావం చూపిందని చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో కాబూల్ నగరంలోని వజీర్ అక్బర్ ఖాన్ ఆసుపత్రికి 10వేల క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు కావాల్సిన వైద్య సామాగ్రిని పంపించామని డాక్టర్ అల్ మందారి చెప్పారు. 


Updated Date - 2021-08-19T13:40:17+05:30 IST