నాలుగు సింగరేణి ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు

ABN , First Publish Date - 2021-05-12T05:37:45+05:30 IST

కొవిడ్‌ అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగరాదన్న ఉద్దేశ్యంతో సింగరేణి మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. సంస్థ పరిధిలోని నాలుగు సింగరేణి ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

నాలుగు సింగరేణి ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు

  రూ.2కోట్లతో నిర్మాణం 

మరో రూ.3.15కోట్లతో వెంటిలేటర్లు, వైద్య పరికరాల కొనుగోలు 

సంస్థ సీఎండీ ఎన్‌. శ్రీధర్‌  

కొత్తగూడెం, మే 11: కొవిడ్‌ అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగరాదన్న ఉద్దేశ్యంతో సింగరేణి మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. సంస్థ పరిధిలోని నాలుగు సింగరేణి ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాదాపు రూ.2కోట్లతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌. శ్రీధర్‌ తెలిపారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడిచారు.  అలాగే కొవిడ్‌ చికిత్స సెంటర్లకు అవసరమైన వెంటిలేటర్లు ఇతర అత్యవసర సేవల వైద్య పరికరాల కొనుగోలుకు మరో రూ.3.15కోట్లను ఆయన మంజూరు చేశారు. ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా ఉన్న కొవిడ్‌ వార్డులు, క్వారంటైన్‌ సెంటర్లలో ఆక్సిజన్‌ కొరత లేకపోయినా రానున్న రోజుల్లో కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ఆక్సిజన్‌ కొరత రాకుండా చూసేందుకు సొంతగా ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చైర్మన్‌ తెలిపారు. ఈ ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆసుపత్రి, భూపాపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి, మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్‌ ఏరియాలోని ఆసుపత్రి, కుమ్రంభీం జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మరో నాలుగైదు వారాల్లో వీటి నిర్మాణం పూర్తిచేయాలని సీఎండీ ఆదేశించారు.  

 రూ.3.15లక్షలతో వెంటిలేటర్లు ఇతర పరికరాల కొనుగోలు 

సింగరేణి వ్యాప్తంగా 1400 బెడ్లు, 20 మంది అదనపు డాక్టర్లు, సుమారు 250 మంది సహాయ వైద్య సిబ్బందిని సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసుకొని కొవిడ్‌ వ్యాధి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. కాగా ఆసుపత్రుల్లో ఇంకా అదనంగా కావలసి ఉన్న వెంటిలేటర్లు వంటి అత్యవసర పరికరాలను వెంటనే సమకూర్చుకోవాలని చైర్మన్‌ ఆదేశించిన నేపథ్యంలో వైద్యశాఖ 310 పరికరాల కొనుగోలుకు అవసరమైన రూ.3.15కోట్లను మంగళవారం విడుదల చేశారు. తక్షణమే ఆయా పరికరాలను కొనుగోలు చేసి ఆసుపత్రులకు తరలించాలని సీఎండీ ఆదేశించారు. కొనుగోలు చేయబోయే పరికరాల్లో వెంటిలేటర్లు 15, రూమ్‌ ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు 42, ఆక్సిజన్‌ ఫ్లో మీటర్లు 200, మల్టీ పేరా మానిటర్లు 31, ఐఎల్‌ఆర్‌ బ్లడ్‌ బ్యాంకులు 8, హై ఫ్లో నాసల్‌ డివైజ్‌లు 28, ఇంకా ఇతర పరికరాలు ఉన్నాయి. 

Updated Date - 2021-05-12T05:37:45+05:30 IST