వ్యాక్సినేషన్ ఎక్కువగా జరిగిన రాష్ట్రాల్లో ఆక్సిజన్ అవసరం తక్కువ
ABN , First Publish Date - 2021-05-19T09:14:45+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రాణవాయువు అందక 500 మందికిపైగా కరోనా రోగులు మరణించారు.
హైదరాబాద్, మే 18: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రాణవాయువు అందక 500 మందికిపైగా కరోనా రోగులు మరణించారు. అయితే గత నెల 28న సుప్రీంకోర్టుకు కేంద్రం సమర్పించిన అఫిడవిట్లో దీనికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ కో సం వచ్చిన అభ్యర్థనలను కేంద్రం అందులో పేర్కొంది. అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ గణాంకాలను పరిశీలిస్తే... వ్యాక్సినేషన్ ఆలస్యం కావడం కూడా ఆక్సిజన్ కొరత ఏర్పడానికి పరోక్షంగా కారణమైనట్టు అర్థమవుతోంది. వ్యాక్సినేషన్ వేగంగా జరిగిన రాష్ట్రాల్లో ఆక్సిజన్ సమస్య తక్కువగా ఉండటం విశేషం. కేంద్రం సమర్పించిన అఫిడవిట్ ప్రకా రం... ఆంధ్రప్రదేశ్, చత్తీ్సగఢ్, బెంగాల్ రాష్ట్రాల్లో కేసుల తీవ్రత సమానంగా ఉంది. ఏపీలో 1.07 లక్షలు, ఛత్తీ్సగఢ్లో 1.15లక్షలు, బెంగాల్లో 1.05లక్షల చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే ఈ రాష్ట్రాలకు అవసరమైన ఆక్సిజన్ విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. ఏపీ 480 ఎంటీలు(మెట్రిక్ టన్నులు), బెంగాల్ 308 ఎంటీ లు ఆక్సిజన్ కావాలని కోరితే, వీటికంటే తక్కువగా ఛత్తీ్సగఢ్ 227 ఎంటీలే కోరింది. రాజస్థాన్లో 1.63లక్షల కరోనా కేసులుంటే.. ఆక్సిజన్ మాత్రం ఏ పీ, బెంగాల్ కోరిన దానికంటే తక్కువగా 265 ఎంటీలు కావాలని ఆ రాష్ట్రం అభ్యర్థించింది.
ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలు వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ, బెంగాల్ కంటే చాలా ముందున్నాయి. అందుకే ఆ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ, వ్యాధి తీవ్రత తక్కువగా ఉంది. అందుకే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆక్సిజన్ అవసరం కూడా తక్కువగా ఉంది. గత ఆదివారం నాటికి ఏపీలో 45ఏళ్లు పైబడినవారిలో 30శాతం మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తయింది. బెంగాల్లో కూడా దాదాపు ఇదే విధంగా వ్యాక్సినేషన్ జరిగింది. కానీ ఛత్తీ్సగఢ్లో ఇదే వయోవర్గంలో 67శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. రాజస్థాన్లో 60ఏళ్లు పైబడినవారిలో 80శాతం మందికి, 45-60 ఏళ్ల మధ్యవారిలో 61శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. వ్యాక్సినేషన్ వేయించుకొన్నవారిలో ఒకవేళ కరోనా సోకినా చాలా అరుదుగా మాత్రమే ఆక్సిజన్ అవసరం ఉంటుందని ఆయా రాష్ట్రాల అధికారులు పేర్కొన్నారు. దీన్నిబట్టి.. వేగంగా వ్యాక్సినేషన్ జరగడం అనేది ఆక్సిజన్ కొరతను నివారించడంలో కీలకంగా మారినట్టు తెలుసుకోవచ్చు. మణిపూర్, త్రిపురలాంటి చిన్న రాష్ట్రాలను పోల్చిచూసినా ఇదే విషయం తెలుస్తుంది.
=================================