పీఏసీఎస్ చైర్మన్ వేధింపులతోనే ఆత్మహత్య!
ABN , First Publish Date - 2021-10-20T04:36:20+05:30 IST
చేర్యాల పీఏసీఎస్ సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్ర నిర్వాహకుడిగా పనిచేసిన కొమురవెల్లి మండలం మర్రిముచ్ఛాల గ్రామానికి చెందిన చదరపల్లి పరశురాములు ఆత్మహత్యపై న్యాయవిచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మల్లిగారి యాదయ్య డిమాండ్ చేశారు.
పరశురాములు బలవన్మరణంపై విచారణ చేపట్టాలి
ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి యాదయ్య
చేర్యాల, అక్టోబరు 19: చేర్యాల పీఏసీఎస్ సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్ర నిర్వాహకుడిగా పనిచేసిన కొమురవెల్లి మండలం మర్రిముచ్ఛాల గ్రామానికి చెందిన చదరపల్లి పరశురాములు ఆత్మహత్యపై న్యాయవిచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మల్లిగారి యాదయ్య డిమాండ్ చేశారు. మంగళవారం చేర్యాలలో పరశురాములు తల్లిదండ్రులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి వేధింపులు, పని ఒత్తిడి భరించలేక పరశురాములు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. పరశురాములు సెల్ఫోన్ కాల్రికార్డును పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పోలీసులను కోరినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో వారు న్యాయం చేయాలని అభ్యర్థిస్తూ తమను ఆశ్రయించారని తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి న్యాయవిచారణ జరిపించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఆయనవెంట సనవాల ప్రసాద్, బండ అయిలయ్య తదితరులు ఉన్నారు.