ఆదరించారు.. అండగా నిలిచారు!

ABN , First Publish Date - 2021-12-08T04:10:57+05:30 IST

‘ఒకటే రాష్ట్రం.. ఒకటే రాజధాని నినాదంతో నెల్లూరు జిల్లాలో సాగిన మహా పాదయాత్రకు ఎన్నో ఒత్తిళ్లను, బెదిరింపులను, సవాళ్లను ఎదుర్కొంటూ కూడా మా వెన్నంటే నడిచి మాలో ఉద్యమ స్ఫూర్తిని మరింత పెంచారు.

ఆదరించారు..  అండగా నిలిచారు!
జేఏసీ నాయకులకు రూ.5లక్షల చెక్కు ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల

మాలో ఉద్యమ స్ఫూర్తి మరింత పెంచారు!

నెల్లూరు వాసులందరికీ సాష్టాంగ నమస్కారం

కృతజ్ఞతలు తెలిపిన రాజధాని రైతులు

చిత్తూరు జిల్లాకు చేరిన మహా పాదయాత్ర


వెంకటగిరి, డిసెంబరు 7 : ‘ఒకటే రాష్ట్రం.. ఒకటే రాజధాని నినాదంతో నెల్లూరు జిల్లాలో సాగిన  మహా పాదయాత్రకు ఎన్నో ఒత్తిళ్లను, బెదిరింపులను, సవాళ్లను ఎదుర్కొంటూ కూడా మా వెన్నంటే నడిచి మాలో ఉద్యమ స్ఫూర్తిని మరింత పెంచారు. అమరావతి అభివృద్ధిలోనే రాష్ట్రాభివృద్ధి ఆధారపడి ఉందని నమ్మి మమ్మల్ని విశేషంగా ఆదరించి, మద్దతు ఇచ్చి అండగా నిలబడిన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ సాష్టాంగ నమస్కారాలతో ధన్యావాదాలు తెలుపుతున్నాం.’ అంటూ అమరావతి రాజధాని రైతులు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర గత నెల 20వ తేదీన నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టింది. అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించినా చాలా ఓర్పుతో జిల్లావాసుల సహకారంతో రాజధాని రైతులు పాదయాత్ర చేపట్టారు. 27 రోజులు జిల్లాలో పర్యటించిన రైతులకు ప్రతిగ్రామంలోనూ మంగళహారతులు పట్టారు. పూలవర్షం కురిపించి అమరావతికి తమ మద్దతు తెలియజేశారు. చివరిగా మంగళవారం నియోజకవర్గ కేంద్రం వెంకటగిరిలో ముగించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వల్లివేడు గ్రామంలోకి అడుగుపెట్టింది. కాగా, సోమవారం రాత్రి స్థానిక ఎస్‌ఆర్‌ఎల్‌ కల్యాణ మండపంలో బస చేసిన రైతులు మంగళవారం ఉదయం 9 గంటలకు రథంలో కొలువుదీరిన వేంకటేశ్వరస్వామికి పూజల అనంతరం యాత్ర ప్రారంభమైంది. మేళతాళాలు, యువత చిందులు, కేరింతల నడుమ సుమారు రెండున్న కిలోమీటర్లు నెల్లూరు జిల్లా సరిహద్దు వరకు రైతులు పాదయాత్ర చేశారు. 10.30 గంటలకు చిత్తూరు జిల్లాలోకి అడుగు పెట్టారు. వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, గంగోటి నాగేశ్వరరావు అమరావతి రైతులకు ఘన వీడ్కోలు పలికారు. 


రూ.11 లక్షల విరాళాలు


వెంకటగిరి నియోజకవర్గం నుంచి మంగళవారం రూ.11 లక్షలకు పైగా విరాళాలు అమరావతి రైతులకు అందజేసినట్లు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాను రూ.5లక్షలు, గంగోటి నాగేశ్వరావు 2 లక్షలు, నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల్లో  3 లక్షలు, సైదాపురం మండలం తుమ్మలతలపూరు గ్రామానికి చెందిన పెమ్మసాని సుగుణ రూ.లక్ష విరాళం అందజేసినట్లు తెలిపారు. కాగా, తన నియోజకవర్గంలో నాలుగు రోజులు చేపట్టిన మహాపాదయాద్ర విజయవంతంగా జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. రైతుల వెన్నంటి ఉండి  ముందుకు నడిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గంగోటి నాగేశ్వరావు, ఈ.రామచంద్రనాయుడు, రాజేశ్వరావు, శ్రీరామదాసు గంగాదర్‌, కేవీకే ప్రసాద్‌ నాయుడు, కాపా శ్రీనివాసుల నాయుడు, టీవీఆర్‌, గెరిట చెంచయ్య యాదవ్‌, మంకు ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-12-08T04:10:57+05:30 IST