ప్రకటించిన ‘పద్మశ్రీ’ కోసం ఎదురుచూపులు... అనారోగ్యంతో షరీఫ్ చాచా అవస్థలు
ABN , First Publish Date - 2021-02-21T13:04:13+05:30 IST
ఆయన గడచిన 25 ఏళ్లలో 25 వేల అనాథ మృతదేహాలకు...
ఫైజాబాద్: ఆయన గడచిన 25 ఏళ్లలో 25 వేల అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేయించారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఆయనకు 2020లో ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపికచేసింది. ఆయనే ‘షరీఫ్ చాచా’. ఇంతటి ఘనమైన పురస్కారం అందించిన ప్రభుత్వం ఆయనకు కనీసం పింఛను కూడా అందించడంలేదు. దీంతో షరీఫ్ చాచా అర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో మొహల్లా ఖిర్కి అలీబేగ్కు చెందిన మొహమ్మద్ షరీఫ్(83) ప్రస్తుతం వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నారు.
తన తండ్రి అనాథలకు అందించిన సేవలను గుర్తించి, ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మశ్రీ’ని ఇంకా ఇవ్వకపోవడం శోచనీయమని అతని కుమారుడు షగీర్ వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తండ్రికి పింఛను మంజూరు చేయాలని షగీర్ కోరుతున్నారు. డ్రైవర్గా పనిచేస్తున్న తాను నెలకు రూ.7వేలు సంపాదించగలుగుతున్నానని, అది కుటుంబ నిర్వహణకు సరిపోవడం లేదని షగీర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి వైద్యం కూడా చేయించలేకపోతున్నానని, ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు.