ఢిల్లీలో మోదీ సభ కన్నా ఇమ్రాన్ సభకు ఎక్కువ జనాలు : పాక్ మంత్రి
ABN , First Publish Date - 2021-10-24T22:13:41+05:30 IST
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్కు భారత దేశంలో
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్కు భారత దేశంలో అత్యధిక జనాదరణ ఉందని పాక్ సమాచార, ప్రసార శాఖల మంత్రి ఫవద్ చౌదరి చెప్పారు. దుబాయ్లో ఇండియా-పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ నేపథ్యంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఢిల్లీలో ఇమ్రాన్ సభ పెడితే పీఎం మోదీ సభ కన్నా ఎక్కువ జనాలు వస్తారన్నారు.
ఫవద్ చౌదరి మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్కు భారత దేశంలో చాలా జనాదరణ ఉందన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఇమ్రాన్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే, భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభ కన్నా పెద్ద సభ అవుతుందన్నారు. భారత్-పాక్ మధ్య సంబంధాలు దెబ్బతినడానికి మోదీయే కారణమని ఆరోపించారు. టీ20 మ్యాచ్లో భారత జట్టును పాకిస్థాన్ జట్టు ఓడించాలని, సంబరాలు చేసుకునే అవకాశం ఇవ్వాలని తామంతా కోరుకుంటున్నామని చెప్పారు. 1992 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో పాకిస్థాన్ జట్టుకు ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్ అనే సంగతి తెలిసిందే. ఫవద్ వ్యాఖ్యలు కొద్ది క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.