శ్రీనగర్-షార్జా విమానాలకు మోకాలడ్డిన పాక్
ABN , First Publish Date - 2021-11-03T20:52:37+05:30 IST
జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ నుంచి షార్జాకు వెళ్లే విమానాలను తమ గగనతలం నుంచి..
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ నుంచి షార్జాకు వెళ్లే విమానాలను తమ గగనతలం నుంచి వెళ్లేందుకు పాకిస్థాన్ మరోసారి అనుమతి నిరాకరించింది. ఇది చాలా దురదృష్టకరమైన చర్య అని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఓ ట్వీట్లో వ్యాఖ్యానించారు. 2009-2010లో కూడా ఇదే విధంగా శ్రీనగర్ నుంచి దుబాయ్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ను అనుమతించలేదని ఆయన అన్నారు. పాకిస్థాన్ మనసు మార్చుకుని, తమ గగనతలం వినియోగించుకునేందుకు అనుమతిస్తుందన్న అశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. శ్రీనగర్-షార్జా విమానాలను తమ గగనతలం నుంచి వెళ్లేందుకు పాక్ అనుమతించకపోవడంతో ఆ విమానాలు ఉదయ్పూర్, అహ్మదాబాద్, ఒమెన్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఇందువల్ల విమానాలకు ఒక గంట అదనపు ప్రయాణం అవుతుంది. శ్రీనగర్-షార్జా విమానాలను కేంద్ర హోం మంత్రి అమిత్షా అక్టోబర్ 3న శ్రీనగర్లోని షేక్ ఉల్-అలాం ఇంటర్వేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభించారు. కశ్మీర్కు, యూఏపీకి మధ్య 11 ఏళ్ల తర్వాత ఈ విమాన సర్వీసులను పునరుద్ధరించారు.
కాగా, దీనికి ముందు జీ-20 సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాన మంత్రి నరేష్ మోదీ వివీఐపీ ప్రత్యేక విమానంలో పాకిస్థాన్ ఎయిర్స్పేస్ గుండానే ఇటలీకి వెళ్లారు. తిరుగుప్రయాణంలో ఇదే మార్గంలో వచ్చేందుకు ఇస్లామాబాద్ నుంచి లాంఛనంగా అనుమతి తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. మోదీ ప్రయాణించిన బోయింగ్ 777,300ఇఆర్, కే7066 విమానం బహవల్పూర్ గుండా పాకిస్థాన్ గగనతంలోకి ప్రవేశించి టుర్బట్, పంజగుర్, ఇరాన్, టర్కీ మీదుగా ఇటలీ చేరినట్టు ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ ఒక వార్తా కథనంలో పేర్కొంది.