Pakistan-Afghanistan: యూఏఈ నుంచి శ్రీలంకకు తరలిపోయిన వన్డే సిరీస్

ABN , First Publish Date - 2021-07-25T02:28:05+05:30 IST

పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ శ్రీలంకకు తరలిపోయింది. రెండు జట్ల మధ్య

Pakistan-Afghanistan: యూఏఈ నుంచి శ్రీలంకకు తరలిపోయిన వన్డే సిరీస్

కాబూల్: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ శ్రీలంకకు తరలిపోయింది. రెండు జట్ల మధ్య సెప్టెంబరు 1-5 మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వన్డే సిరీస్ జరగాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో యూఏఈలో స్టేడియాలు అందుబాటులో లేకపోవడంతోనే సిరీస్‌ను శ్రీలంకకు మార్చినట్టు తెలుస్తోంది. హంబన్‌తోటలోని మహింద రాజపక్ష స్టేడియంలో మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయించారు. 


రాబోనే నాలుగు నెలలు యూఏఈలోని స్టేడియాలు క్రికెట్ మ్యాచ్‌ల షెడ్యూల్స్‌తో నిండిపోయాయి. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో దశ, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా, అక్టోబరు 17-నవంబరు 14 మధ్య టీ20 ప్రపంచకప్ జరగనుంది.  


పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్. ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో ఈ సిరీస్ కూడా భాగం కాబట్టి ఈ సిరీస్  ఇరు జట్లకు ఎంతో కీలకం. పాకిస్థాన్ 40 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉండగా, ఆఫ్ఘనిస్థాన్ 30 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. 

Updated Date - 2021-07-25T02:28:05+05:30 IST