ఆఫ్ఘన్ మాజీ పీఎంతో పాక్ ఐఎస్ఐ చీఫ్ భేటీ
ABN , First Publish Date - 2021-09-05T23:23:19+05:30 IST
ఆఫ్ఘనిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి గుల్బుద్దీన్ హెక్మత్యార్, పాకిస్థాన్
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి గుల్బుద్దీన్ హెక్మత్యార్, పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ ఫయీజ్ హమీద్ సమావేశమైనట్లు ఆఫ్ఘన్ మీడియా ఆదివారం తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై వీరు చర్చించినట్లు తెలిపింది. హిజ్బ్-ఈ-ఇస్లామీ నేత ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు పేర్కొంది.
మరోవైపు ఇరాన్, చైనా, తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్ దౌత్యవేత్తలతో పాకిస్థాన్ ఆన్లైన్ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపింది. ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్థాన్పై చర్చించినట్లు పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల కోసం ఆఫ్ఘనిస్థాన్లో ప్రశాంతత ఏర్పడటం చాలా ముఖ్యమైనదని ఈ దౌత్యవేత్తలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని ఆఫ్ఘనిస్థాన్కు పాకిస్థాన్ ప్రత్యేక ప్రతినిధి మహమ్మద్ సాదిక్ చెప్పినట్లు తెలిపింది.
ఇదిలావుండగా, ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత తాలిబన్లకు అధికార మార్పిడి శాంతియుతంగా జరగడం కోసం సమన్వయ మండలి ఏర్పాటైంది. గుల్బుద్దీన్ హెక్మత్యార్, ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, ఆఫ్ఘన్ హై కౌన్సిల్ ఫర్ నేషనల్ రీకన్సిలియేషన్ చైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లా ఈ మండలిని ఏర్పాటు చేశారు.