పాకిస్థానీ స్మగ్లర్ వివరాలిస్తే భారీ నజరానా.. అమెరికా ప్రకటన

ABN , First Publish Date - 2021-10-15T03:50:45+05:30 IST

మనుషుల అక్రమ రవాణాలో ఆరితేరిన పాకిస్థానీ స్మగ్లర్ అబిద్ అలీ ఖాన్ వివరాలిస్తే రెండు మిలియన్ల డాలర్లు నజరానా ఇస్తామంటూ అమెరికా గురువారం నాడు ప్రకటించింది.

పాకిస్థానీ స్మగ్లర్ వివరాలిస్తే భారీ నజరానా.. అమెరికా ప్రకటన

ఇంటర్నెట్ డెస్క్: మనుషుల అక్రమ రవాణాలో ఆరితేరిన పాకిస్థానీ స్మగ్లర్ అబిద్ అలీ ఖాన్ వివరాలిస్తే రెండు మిలియన్ డాలర్ల నజరానా ఇస్తామంటూ అమెరికా గురువారం నాడు ప్రకటించింది. అతడి వివరాలు ఇస్తే ఒక మిలియన్ డాలర్లు ఇస్తామని, అతడి నెట్వర్క్‌ గుట్టుమట్లను బట్టబయలు చేసే వివరాలు అందిస్తే మరో మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఓ ట్వీట్ చేశారు.


పాకిస్థాన్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహించే అబిద్.. మధ్యప్రాచ్యం, సౌత్‌వెస్ట్ ఆసియా నుంచి మనుషుల్ని అక్రమంగా అమెరికాకు తరలిస్తున్నట్టు అమెరికా వర్గాలు పేర్కొన్నాయి.  అమెరికాలో ప్రవేశించేందుకు వీలుగా వారికి నకిలీ డాక్యుమెంట్లను అబిద్ సిద్ధం చేస్తాడని పేర్కొన్నాయి. అతడి కార్యకలాపాల కారణంగా ఎందరో అమాయకులు అనేక ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని చెప్పాయి. కాగా.. ఏప్రిల్ 2021న అమెరికా ప్రభుత్వం అబిద్‌పైనా అతడి సంస్థలపైనా పలు ఆంక్షలు విధించింది. 



Updated Date - 2021-10-15T03:50:45+05:30 IST