పాలెం ప్రాజెక్టు ప్రధాన కాల్వకు గండి
ABN , First Publish Date - 2021-04-09T06:04:48+05:30 IST
పాలెం ప్రాజెక్టు ప్రధాన కాల్వకు గండి
వెంకటాపురం(నూగూరు), ఏప్రిల్ 8: మండలంలోని బొల్లారం-యోగితానగర్ గ్రామాల మధ్యలో పాలెంవాగు ప్రాజెక్టు ప్రధాన కాల్వకు గండి పడిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రబీలో పాలెంవాగు ప్రాజెక్టు కింద నూగూరు, బర్లగూడెం, చిరుతపల్లి, మహితాపురం గ్రామాలకు చెందిన రైతులు వరిపంటను సాగుచేస్తున్నారు. పంటలకు నీళ్లు అందించేందుకు ప్రధాన కాల్వకు నీటిని అధికారులు విడుదల చేశారు. యోగితానగర్- బొల్లారం గ్రామాల మధ్యలో ప్రధాన కాల్వకు వర్షాకాలంలో గండిపడడంతో అధికారులు ఇసుక బస్తాలు వేసి గండిని పూడ్చారు. ప్రధాన కాల్వకు నీళ్లు వదలడంతో తిరిగి అదే ప్రాంతంలో గండిపడి నీరు వృథాగా పోతోంది. దీంతో ప్రాజెక్టు కాల్వ కింద వరి పంట వేసిన బర్లగూడెం, రామవరం, చిరుతపల్లి, యోగితానగర్ గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సంబంధిత అధికారులు త్వరగా గండిని పూడ్చి పంట పొలాలకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు