పల్లా కాన్వాయ్ను చూసి జై ఈటల అంటూ నినాదాలు
ABN , First Publish Date - 2021-06-17T17:57:08+05:30 IST
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటిస్తున్నారు. అదే సమయంలో...
కరీంనగర్ జిల్లా: హుజురాబాద్లో రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటిస్తున్నారు. అదే సమయంలో ఆ దారిలో ఈటల రాజేందర్ అనుచరులు కనిపించారు. పల్లా కాన్వాయ్ను చూసి జై ఈటల అంటూ అభిమానులు నినాదాలు చేశారు. కాట్రపల్లిలో బీజేపీ కార్యకర్తలు హడావుడి చేశారు.
ఈటల బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి హుజూరాబాద్ నియోజకవర్గానికి వస్తున్నారు. ఆయనకు స్వాగతం చెప్పేందుకు నియోజకవర్గంలోని కాట్రపల్లి ఎక్స్ రోడ్డు వద్ద చాలా మంది బీజేపీ కార్యకర్తలు జెండాలు, ప్లెక్సీలతో ఉన్నారు. అదే సమయంలో హుజూరాబాద్లోని జమ్మికుంటకు పల్లా కన్వాయ్ వెళుతుంది. పల్లాను చూసిన బీజేపీ కార్యకర్తలు జై ఈటల అంటూ నినాదాలు చేశారు. ముందు మరికొన్ని వాహనాలు ఉండడంవల్ల పల్లా కాన్వాయ్ రెండు నిముషాలపాటు ఆగిపోయింది. దీంతో బీజేపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. జై ఈటల.. జై ఈటల అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో పల్లాకు ఊహించని అనుభవం ఎదురైంది.