తిరుమలలో వేడుకగా పల్లవోత్సవం
ABN , First Publish Date - 2021-07-29T07:16:47+05:30 IST
తిరుమలలో బుధవారం పల్లవోత్సవం వేడుకగా జరిగింది.
తిరుమల, జూలై 28 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో బుధవారం పల్లవోత్సవం వేడుకగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా బుధవారం సహస్రదీపాలంకార సేవ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని కర్టాటక సత్రానికి వేంచేపు చేసి మైసూరు సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ.. మైసూరు సంస్థానం ప్రతినిధులు ఉత్సవమూర్తులకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మైసూరు ప్యాలెస్ మహారాణి ప్రమోదాదేవి వడయార్, కర్ణాటక రెవెన్యూ, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మంజునాథ్ ప్రసాద్, దేవదాయ శాఖ కమిషనర్ రోహిణి సింధూరి, శ్రీవారి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు తిరుమలకు చేరుకున్న మైసూరు ప్యాలెస్ మహారాణి ప్రమోదాదేవి వడయార్కు టీటీడీ రిసెప్షన్ అధికారులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.