పంచాయతీ స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు
ABN , First Publish Date - 2021-10-20T04:50:00+05:30 IST
‘అమ్మకానికి పంచాయతీ స్థలం’ అన్న శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో వెలువడిన కథనానికి జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించారు.
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
పొదలకూరు, అక్టోబరు 19 : ‘అమ్మకానికి పంచాయతీ స్థలం’ అన్న శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో వెలువడిన కథనానికి జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించారు. పట్టణంలోని పెన్నా సుధాకర్రెడ్డి హాస్పిటల్ ఎదురువీధిలో ఉన్న సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్లోని ప్రజా ప్రయోజనాల స్థలం (286 అంకణాల) చుట్టూ రాళ్లు నాటి ఫెన్సింగ్ ఏర్పాటును మంగళవారం చేపట్టారు. పంచాయతీ పాలకవర్గం, కార్యదర్శి అల్లాబక్షు సరిహద్దు రాళ్లు నాటారు. మరో రెండు రోజుల్లో చుట్టూ ఫెన్సింగ్ తీస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది పంచాయతీ స్థలమని ఇప్పటికే హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ స్థలాన్ని ఫేక్ సర్వే నెంబర్లతో ఎవరైనా క్రయవిక్రయాలు జరిపిన అవి చెల్లవన్నారు. ఈ స్థలంలోకి అనుమతి లేకుండా ఎవరైనా ప్రవేశించిన చట్టరీత్యా శిక్షార్హులు అవుతారని, వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.