పనీర్ వెర్మిసెల్లీ బాల్స్
ABN , First Publish Date - 2021-12-18T18:14:20+05:30 IST
బంగాళదుంపలు - రెండు, పనీర్ - 120గ్రా, వెర్మిసెల్లీ(సేమ్యా) - 120గ్రా, పెరుగు - ఒక టేబుల్స్పూన్,
కావలసినవి: బంగాళదుంపలు - రెండు, పనీర్ - 120గ్రా, వెర్మిసెల్లీ(సేమ్యా) - 120గ్రా, పెరుగు - ఒక టేబుల్స్పూన్, అల్లం - చిన్న ముక్క, మైదా - పావు కప్పు, పచ్చిమిర్చి - ఒకటి, మిరియాల పొడి - పావుటీస్పూన్, చాట్ మసాల - ఒక టీస్పూన్, కారం - చిటికెడు, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం:బంగాళదుంపలు ఉడికించుకోవాలి. వెర్మిసెల్లీని వేయించి పెట్టుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, దంచిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము వేసి పేస్టులా తయారుచేసుకోవాలి. తరువాత అందులో ఉడికించిన బంగాళదుంపముక్కలు, పనీర్ముక్కలు, చాట్మసాల, తగినంత ఉప్పు వేసి కలుపుకొంటే స్టఫ్ రెడీ అయినట్టే. మరొక పాత్రలో మైదా, మిరియాల పొడి, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. మరీ చిక్కగా కాకుండా, పలుచగా కాకుండా చూసుకోవాలి. వేగించిన వెర్మిసెల్లీని కొద్దిగా నలపాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ను నిమ్మకాయంత సైజులో బాల్స్లా రెడీ చేసుకోవాలి. వీటిని మైదా మిశ్రమంలో ముంచి, వెర్మిసెల్లీ అంటుకునేలా అద్దాలి. స్టవ్పై పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక వెర్మిసెల్లీ బాల్స్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకిష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవాలి.