కాంగ్రెస్‌లో విలీనం కానున్న పప్పు యాదవ్ పార్టీ

ABN , First Publish Date - 2021-12-10T21:39:27+05:30 IST

బీహార్‌లో రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ సారథ్యంలోని జన్ అధికార్ పార్టీ (జేఏపీ) త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో..

కాంగ్రెస్‌లో విలీనం కానున్న పప్పు యాదవ్ పార్టీ

పాట్నా: బీహార్‌లో రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ సారథ్యంలోని జన్ అధికార్ పార్టీ (జేఏపీ) త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుంది. ఈనెల 16,17 తేదీల్లో జేఏపీ సమావేశమవుతుందని, కాంగ్రెస్‌తో విలీనం విషయాన్ని అన్ని కోణాల నుంచి విశ్లేషించి ఒక నిర్ణయం తీసుకుటుందని జేఏపీ వర్గాలు తెలిపారు.


''డిసెంబర్ 2న పార్టీకి చెందిన అన్ని కమిటీలు, విభాగాలను మా నేత పప్పు యాదవ్ రద్దు చేశారు. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు రాఘవేంద్ర కుష్హాహ కూడా ప్రకటించారు. కమిటీలు, విభాగాలు రద్దు చేయడమంటే విలీనం సంకేతాలు ఇవ్వడమే. దీంతో పార్టీలో ఎవరికీ పదవులు ఉండవు. తద్వారా పార్టీ చీఫ్ నిర్ణయాన్ని సవాలు చేసే అధికారం ఏ ఒక్కరికీ ఉండదు'' అని జేఏపీ వర్గాలు తెలిపాయి.


జేఏపీలో జనాకర్షణ కలిగిన నేత పప్పుయాదవ్ ఒక్కరే. తక్కిన వారెవరికీ ఎన్నికల్లో జనాలను ఆకట్టుకోగలిగే సత్తా లేదు. బీహార్‌లో ఆర్జేడీ, జేడీయూ, బీజేపీ వంటి పెద్ద పార్టీలతో తలపడటం ఆషామాషీ కాదు. ఆ నేపథ్యంలో కాంగ్రెస్‌ వంటి గ్రేండ్ ఓల్డ్ పార్టీతో విలీనం కావడం తెలివైన నిర్ణయం అవుతుంది. కాంగ్రెస్‌లో జేఏపీ విలీనం ఆలోచన వెనుక రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఉన్న పప్పుయాదవ్ భార్య రంజీత్ రంజన్ కీలక పాత్ర వహిస్తున్నట్టు చెబుతున్నారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పప్పు యాదవ్ పార్టీ ఓ అరడజను చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని మొత్తం 243 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేక చతికిలపడింది.

Updated Date - 2021-12-10T21:39:27+05:30 IST