జేరిపోతుల పరశురామ్ మహాపాదయాత్ర
ABN , First Publish Date - 2020-09-22T06:29:52+05:30 IST
వంద సంవత్సరాల క్రితం 1920 దశకంలో రూపాయి విలువ కాపాడేందుకు డాక్టర్ బి.ఆర్ .అంబేడ్కర్ నాటి బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడారు. ఈ క్రమంలో ‘ది ప్రాబ్లమ్స్ ఆఫ్ రూపీ:...
వంద సంవత్సరాల క్రితం 1920 దశకంలో రూపాయి విలువ కాపాడేందుకు డాక్టర్ బి.ఆర్ .అంబేడ్కర్ నాటి బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడారు. ఈ క్రమంలో ‘ది ప్రాబ్లమ్స్ ఆఫ్ రూపీ: ఇట్స్ ఆరిజిన్స్ అండ్ ఇట్స్ సొల్యూషన్స్’ మొదలైన గ్రంథాలను రాశారు. భారతదేశానికి ఒక సెంట్రల్ బ్యాంకు అవసరమని నాటి వలస పాలకులకు ఆయన గట్టిగా సూచించారు. ఆ సూచనను నాటి వైస్రాయి అంగీకరించి, దానిని సైమన్ కమిషన్ పరిశీలనకు నివేదించారు. భారత్కు ఒక సెంట్రల్ బ్యాంక్ అవసరమని సైమన్ కమిషన్ సైతం అంగీకరించింది. 1934లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సెంట్రల్బ్యాంక్ ఏర్పాటుకుగాను ఒక బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించారు. తత్ఫలితంగా 1935 ఏప్రిల్ 1న ‘రిజర్వ్ బ్యాంక్ ఇండియా చట్టం’ అమల్లోకి వచ్చింది. 1935లో రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటైంది.
ఇప్పుడు మా ప్రశ్న ఏమిటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూపకల్పన చేసింది డాక్టర్ అంబేడ్కర్ కాదా? భారత రాజ్యాంగ నిర్మాత కూడా అయిన అంబేడ్కర్ బొమ్మ స్వతంత్ర భారతదేశ కరెన్సీ నోట్లపై లేకపోవడం అనుచితం కాదా? రిజర్వ్బ్యాంక్ ఏర్పాటుకు స్ఫూర్తి ప్రదాత అయిన అంబేడ్కర్ బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రించాలన్న డిమాండ్తో ఉద్యమిస్తున్నాం. ఈ లక్ష్య సాధనకై వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జేరిపోతుల పరశురామ్ మహాపాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ నెల 26 నుంచి 30వ తేదీవరకు జరిగే మహాపాదయాత్రను పరశురామ్ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని తమ స్వగ్రామం వెల్మజాల లోగల డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర నుంచి హైదరాబాద్లోని రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం దాకా నిర్వహించనున్నారు. ఈ యాత్ర సెప్టెంబర్ 26న వెల్మజాల నుంచి ఆలేరు; సెప్టెంబర్ 27న ఆలేరు నుంచి భువనగిరి; సెప్టెంబర్ 28న భువనగిరి నుంచి ఘట్కేసర్; సెప్టెంబర్ 29న ఘట్కేసర్ నుంచి రామాం తాపూర్; సెప్టెంబర్ 30న రామాంతాపూర్ నుంచి ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం మీదుగా ఆర్బీఐ కార్యాలయం వరకు సాగుతుంది. అన్ని రాజకీయపార్టీలు, అంబేడ్కర్ సంఘాలు, దళిత సంఘాలు, ప్రజాసంఘాలు ఈ మహా పాదయాత్రకు మద్దతునిచ్చి జయప్రదం చేయాలి.
జేరిపోతుల పరశురామ్
రాష్ట్ర అధ్యక్షులు వికలాంగుల హక్కుల పోరాట సమితి