కరోనా ఫలితాలు తారుమారైతే పిట్ట కథలు, సినిమా కథలా!

ABN , First Publish Date - 2020-07-15T18:10:23+05:30 IST

జిల్లాలో 27 వేలకు పైగా కరోనా పరీక్షల ఫలితాలు తారుమారై..

కరోనా ఫలితాలు తారుమారైతే పిట్ట కథలు, సినిమా కథలా!

కష్టపడి పనిచేసే వారు కావాలి

ఎమ్మెల్యే ఏలూరి  సాంబశివరావు


పర్చూరు(ప్రకాశం): జిల్లాలో 27 వేలకు పైగా కరోనా పరీక్షల ఫలితాలు తారుమారై గందరగోళ పరిస్థితులు నెలకొని ఉంటే పిట్ట కథలు, సినిమా స్టోరీలు చెప్పి బాధ్యతను మరిచి విస్మరించడం తగదని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. జిల్లాలో ముగ్గురు జాయింట్‌ కలెక్టర్‌ క్యాడర్‌ అధికారులు, 20 మందికి పైగా సమర్థంగా పనిచేసే అధికారులు, వేలాది మంది క్షేత్ర స్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేస్తుండగా వేలాది కరోనా పరీక్షల కిట్లు తారుమారు కావడం విచారకరమని తెలిపారు.


ఈ విషయంలో దేశంలోనే  జిల్లాకు చెడ్డపేరు వచ్చిందని వివరించారు. కేవలం కలెక్టర్‌ బాధ్యతారాహిత్యం వల్ల ప్రజలు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. కలెక్టర్‌కు అంత ఉత్సాహం ఉంటే సినిమాలో చెప్పిన విధంగా బాధ్యతలు అప్పగించేందుకు సీఎం, జిల్లా మంత్రికి తెలియజేస్తే వారే  మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారని పేర్కొన్నారు. ఒంగోలు, చీరాల, మార్కాపురం, కందుకూరు తదితర పట్టణాలు వందకుపైగా గ్రామాల్లో  వందల మంది పోలీసులు, ఆరోగ్యశాఖ, రెవెన్యూ, పంచాయతీ అధికారులు అహర్నిశలు శ్రమిస్తుంటే కరోనా పరీక్ష ఫలితాల్లో గందరగోళం సృష్టించి వారి కష్టాన్ని బూడిదలో పోశారని ఆవేదన వ్యక్తం చేశారు.


Updated Date - 2020-07-15T18:10:23+05:30 IST