ఒక్కటే మూత్రపిండం.. అదీ పాడైంది!
ABN , First Publish Date - 2021-03-08T09:54:31+05:30 IST
ఎంతో ఆరోగ్యంగా ఉండే చిన్నారి అనారోగ్యంతో మంచంపట్టింది. చివరికి స్కానింగ్లో ఆ పాపకు ఒక్కటే మూత్రపిండం ఉందని, అది కూడా పాడైందని వైద్యులు తేల్చారు.
కూతురి ఆరోగ్యంపై తల్లిదండ్రుల ఆందోళన
తమ బిడ్డను దాతలే ఆదుకోవాలని కన్నీటి వేడుకోలు
పెదవేగి, మార్చి 7: ఎంతో ఆరోగ్యంగా ఉండే చిన్నారి అనారోగ్యంతో మంచంపట్టింది. చివరికి స్కానింగ్లో ఆ పాపకు ఒక్కటే మూత్రపిండం ఉందని, అది కూడా పాడైందని వైద్యులు తేల్చారు. దీంతో ఆ తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండా పోయింది. తమ పాపకు ప్రాణభిక్ష పెట్టాలని దాతలను కన్నీళ్లతో వేడుకుటున్నారు. వివరాలివీ.. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం కూచింపూడికి చెందిన రంగు శ్రీనివాసరావు, నాగమణి దంపతులు కూలిపనులతో జీవనం సాగిస్తున్నారు. వీరికి కీర్తిక(14) ఒక్కగానొక్క కుమార్తె. స్థానిక జెడ్పీ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. నాలుగు నెలల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఏలూరులో వైద్య పరీక్షలు చేయించగా మూత్రపిండం పాడైన నిర్ధారణ అయింది.
దీంతో కీర్తికను తల్లిదండ్రులు విజయవాడకు తీసుకెళ్లారు. డయాలసిస్ ఒక్కటే మార్గమని చెప్పిన అక్కడి వైద్యులు, ఆర్థికంగా తట్టుకోలేరని, ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకోండంటూ ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి పంపించారు. నెలరోజులుగా ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తూ బాలిక ప్రాణాన్ని నిలుపుకుంటూ వస్తున్నారు. డయాలసిస్ అనేది కొంతకాలం మాత్రమేనని, మూత్రపిండం మార్పిడి చేయిస్తేనే ఆ బాలికకు జీవితం ఉంటుందని వైద్యులు చెప్పారు. మూత్రపిండం ఇవ్వడానికి తండ్రి ముందుకు వచ్చాడు. కానీ దానికి భారీగా సొమ్ము అవసరమవుతుందని వైద్యులు చెప్పారు. కటిక పేదరికంలో ఉన్న ఆ కుటుంబం.. దిక్కుతోచని స్థితిలో కూతురిని రక్షించుకోవడం కోసం దాతల సాయం అర్థిస్తున్నారు. స్థానిక జనసేన నాయకులు రూ.25 వేల సాయం అందించారు. దాతలే తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నాగమణి కన్నీటితో వేడుకుంటున్నారు. దాతలు 81858 33679 నంబరును సంప్రదించాలని కోరుతున్నారు.