శ్మశానంలో శవాలకు పెళ్లి.. తల్లిదండ్రులే దగ్గరుండి..

ABN , First Publish Date - 2021-08-04T08:38:19+05:30 IST

పెద్దల ఆలోచన విధానం వల్ల ఓ యువ జంట ప్రాణాలు కోల్పోయింది. మనసారా ప్రేమించుకున్నా ఒకే వంశ వృక్షానికి చెందిన వారు కావడంతో..

శ్మశానంలో శవాలకు పెళ్లి.. తల్లిదండ్రులే దగ్గరుండి..

పెద్దల ఆలోచన విధానం వల్ల ఓ యువ జంట ప్రాణాలు కోల్పోయింది. మనసారా ప్రేమించుకున్నా ఒకే గోత్రానికి చెందిన వారు కావడంతో కుటుంబ సభ్యలు ఒప్పుకోలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒకరికి ఒకరు విడిచి ఉండలేక ఆ జంట బలవంతంగా ఆత్మహత్య చేసుకుంది. పిల్లల మరణం తరువాత వారి ప్రేమ విలువను గుర్తించిన పెద్దలు శ్మశానంలో వారిద్దరి మృతదేహాలకు వివాహం జరిపించి ఖననం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో ఆదివారం చోటు చేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన యువకుడి పేరు ముఖేష్ సోనావనే(22). యువతి పేరు నేహా థాక్రే(19). ఇద్దరూ పలాడ్ గ్రామానికి చెందిన వారు. నేహ కుటుంబం కొన్ని నెలలుగా వేడ్ గ్రామంలోని బంధువు ఇంట్లో ఉంటోంది. ముఖేష్, నేహా ఇద్దరూ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని ముఖేష్ తన తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాడు. అయితే నేహ వాళ్ల అమ్మా, నాన్న మాత్రం దీనికి అంగీకరించలేదు.


ఇద్దరూ ఒకే గోత్రానికి చెందిన వాళ్లు కావడం వల్ల ఈ పెళ్లికి తాము అంగీకరించమని తేల్చి చెప్పేశారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ముఖేష్, నేహ.. పెద్దలు ఇక తమ వివాహం జరిపించరని నిర్ణయానికి వచ్చి ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తమ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని తెలియడంతో ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపించాయి. పోలీసులు మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాల వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు.


ఈ క్రమంలోనే అంత్యక్రియల సమయంలో ఇరు కుటుంబాలు తమ బిడ్డల కోరిక మేరకు వారి మృతదేహాలకు శ్మశానంలో పెళ్లి తంతు నిర్వహించి ఒక్కటి చేశారు. అనంతరం ఇద్దరినీ ఖననం చేశారు. కాగా.. ఆత్మహత్య చేసుకోబోయే ముందు ముఖేష్ మాత్రం తన వాట్సాప్‌లో ‘గుడ్‌బై’ అని స్టేటస్‌ పెట్టాడు.

Updated Date - 2021-08-04T08:38:19+05:30 IST