పరిటాల సిద్ధార్థ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ABN , First Publish Date - 2021-08-21T21:39:37+05:30 IST
పరిటాల సిద్ధార్థ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో సిద్ధార్థ్ను పోలీసులు విచారిస్తున్నారు.
హైదరాబాద్: పరిటాల సిద్ధార్థ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో సిద్ధార్థను పోలీసులు విచారిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బుల్లెట్తో పరిటాల సిద్ధార్థ్ పట్టుబడ్డాడు. వివరణ ఇవ్వాలని ఎయిర్పోర్ట్ పోలీసులు నోటీసులిచ్చారు. సిద్ధార్థ లైసెన్స్డ్ గన్కు బ్యాగులో దొరికిన బుల్లెట్కు వ్యత్యాసం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో పాయింట్ 32 క్యాలిబర్ గన్కు సిద్ధార్థ్ లైసెన్స్ పొందారు. బుధవారం ఎయిర్పోర్ట్లో సిద్ధార్థ బ్యాగులో 5.56 క్యాలిబర్ బుల్లెట్ పోలీసులకు దొరికింది. సిద్ధార్థ్ వద్ద సాయుధ బలగాలు వాడే ఇన్సాస్ రైఫిల్ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు.
ఈ బుల్లెట్ సిద్ధార్థకు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అనంతపురానికి చెందిన ఇండో టిబెటెన్ బోర్డర్లో పని చేస్తున్న కానిస్టేబుల్ తూటాగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్తో పరిటాల కుటుంబానికి పరిచయాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి శ్రీనగర్కు సిద్ధార్థ వెళ్తుండగా సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీ చేసినపుడు బ్యాగులో బుల్లెట్ ఉన్నట్టు కనుగొన్నారు. కాగా బ్యాగులో బుల్లెట్ ఉందని, దానికి అవసరమైన పత్రాలు లేవని తనకు తెలియదని సిద్ధార్థ చెప్పారు. ఆయనపై ఎయిర్పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి, వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.