పార్లమెంట్ను కుదిపేస్తున్న పెగాసన్ అంశం
ABN , First Publish Date - 2021-07-23T18:04:24+05:30 IST
పార్లమెంట్లో పెగాసన్ అంశం కుదిపేస్తోంది. పెగాసన్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టు పట్టాయి.
న్యూఢిల్లీ: పార్లమెంట్లో పెగాసన్ అంశం కుదిపేస్తోంది. పెగాసన్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టు పట్టాయి. చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతో సభ్యులు పొడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే అంశంపై గందరగోళం నెలకొంది. మరోవైపు జ్యుడీషియల్ విచారణ జరపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పెగాసన్ను కేంద్రం వాడుకుందని వివమర్శించారు.
పెగాసన్ వ్యవహారంపై కేంద్రం సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా స్పైవేర్ సాఫ్ట్వేర్ను వాడారని, సీబీఐ డైరెక్టర్ ఫోన్ను కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారన్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పెగాసన్ వాడినట్టు ఇజ్రాయెల్ తెలిపిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీ, అమిత్ షా పెగాసన్ వాడారన్నారు. కర్నాటకలో ప్రభుత్వం కూల్చివేతకు పెగాసన్ ఉపయోగించారని, హోంమంత్రి అమిత్షా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ లోక్సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ఎటువంటి మార్పు లేకపోవడంతో విపక్ష సభ్యుల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.