23తో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు?
ABN , First Publish Date - 2020-09-20T01:48:07+05:30 IST
పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదించే విషయమై అన్ని పార్టీలు శనివారంనాడు ఏకాభిప్రాయానికి ..
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదించే విషయమై అన్ని పార్టీలు శనివారంనాడు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ నెల 23వ తేదీతో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నట్టు అధికార వర్గాల సమాచారం. పలువురు ఎంపీలు కోవిడ్ పాజిటివ్ బారిన పడుతుండటంతో వచ్చే వారం మధ్యలో సమావేశాలను ముగించే అవకాశాలున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం సెప్టెంబర్ 14న మొదలైన వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1 వరకూ జరగాల్సి ఉన్నాయి.
కాగా, పార్లమెంటు సమావేశాలను కుదించే విషయమై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతను అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు, ప్రభుత్వ ప్రతినిధులు శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. సమావేశాల కుదింపుపై మెజారిటీ పార్టీలు అనుకూలంగా స్పందించాయి. అయితే, దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ సమావేశాల్లో ఆర్డినెన్స్ స్థానంలో ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను లోక్సభ ఆమోదించింది. కోవిడ్పై పోరాటానికి నిధుల కోసం
ఎంపీల వేతనాల్లో 30 శాతం కోతకు సంబంధించిన బిల్లును ఉభయసభలూ ఆమోదించాయి. కాగా, లోక్సభలో ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులను ఆదివారంనాడు రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టనుంది.