పరోటా పసందు

ABN , First Publish Date - 2020-06-20T05:30:00+05:30 IST

ట్విట్టర్‌లో ‘హ్యాండ్స్‌ ఆఫ్‌ పరోటా’ హ్యాష్‌ట్యాగ్‌ కొద్దిరోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. సోషల్‌ మీడియాలో పరోటా మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి. కారణమేంటో తెలుసా? జీఎస్‌టీ. రోటీలపై 5 శాతం జీఎస్‌టీ ఉంటే, పరోటాలపై 18 శాతం జీఎస్‌టీని విధిస్తున్నారు...

పరోటా పసందు

ట్విట్టర్‌లో ‘హ్యాండ్స్‌ ఆఫ్‌ పరోటా’ హ్యాష్‌ట్యాగ్‌ కొద్దిరోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. సోషల్‌ మీడియాలో పరోటా మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి. కారణమేంటో తెలుసా? జీఎస్‌టీ. రోటీలపై 5 శాతం జీఎస్‌టీ ఉంటే, పరోటాలపై 18 శాతం జీఎస్‌టీని విధిస్తున్నారు. అందుకే పరోటా తినాలనిపిస్తే ఇంట్లోనే కానిచ్చేయండి. రకరకాల పసందైన పరోటా    రుచులు ఆస్వాదించండి.



మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ పరోటా

కావలసినవి

గోధుమ పిండి - రెండున్నర కప్పులు, పనీర్‌ - 100 గ్రాములు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, బంగాళదుంపలు - రెండు, క్యారెట్‌ - ఒకటి, క్యాలీఫ్లవర్‌ - ఒకటి(చిన్నది), బీన్స్‌ - ఐదారు, పచ్చి బఠాణీ - అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, గరంమసాలా - అర టీస్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, మామిడికాయ పొడి - అర టీస్పూన్‌, దంచిన ధనియాలు - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, కొత్తిమీర - ఒకకట్ట.


తయారీ

  1. ఒక బౌల్‌లో గోధుమపిండి తీసుకొని అందులో ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. కాస్త నూనె పూసి అరగంట పక్కన పెట్టుకోవాలి. 
  2. బంగాళదుంపలను పొట్టు తీసి చిన్న ముక్కలుగా చేయాలి. క్యారెట్‌, బీన్స్‌, క్యాలీఫ్లవర్‌ను కట్‌ చేయాలి.
  3. కుక్కర్‌లో బంగాళదుంపలు, క్యారెట్‌, బీన్స్‌, క్యాలీఫ్లవర్‌, పచ్చిబఠాణీ వేసి, కాస్త ఉప్పు వేసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి.
  4. మెత్తగా ఉడికిన వెజిటబుల్స్‌ను ఒక పాత్రలోకి తీసుకుని గుజ్జులా చేసుకోవాలి.
  5. స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి కాస్త నూనె వేసి వేడి అయ్యాక అల్లంవెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి వేసి వేగించాలి.
  6. తరువాత గరంమసాలా, ధనియాలు, మామిడికాయ పొడి, జీలకర్రపొడి, ఇంగువ వేసి కలుపుతూ మరి కాసేపు వేగించాలి.
  7. పనీర్‌ను సన్నగా తరిగి వేసి కాసేపు వేగనివ్వాలి.
  8. ఇప్పుడు ఉడికించి, మెత్తగా చేసి పెట్టుకున్న వెజిటిబుల్‌ స్టఫ్‌  వేయాలి. కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
  9. మరో రెండు నిమిషాలపాటు వేగనిచ్చి, కొత్తిమీర వేసి కలిపి దింపాలి.
  10. మెత్తగా చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వెడల్పాటి చపాతీలా చేసుకోవాలి.
  11. మధ్యలో వెజిటబుల్‌ స్టఫ్‌ పెట్టి నాలుగు వైపులా చపాతీని దగ్గరకు తీసుకుని మూయాలి. 
  12. తరువాత మళ్లీ చపాతీ కర్రతో నెమ్మదిగా వెడల్పు చేయాలి. 
  13. పాన్‌పై వీటిని నూనె వేస్తూ పరోటాను రెండు వైపులా కాల్చాలి.
  14. అంతే... వేడి వేడి మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ పరోటా రెడీ.





రవ్వ పరోటా


కావలసినవి

రవ్వ - ఒక కప్పు, ఉప్పు - తగినంత, నూనె -  సరిపడా, గోధుమపిండి - అరకప్పు, కారం - అర టీస్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒక కట్ట, వాము - పావు టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌.


తయారీ 

  1. స్టవ్‌పై పాన్‌ పెట్టి రెండు కప్పుల నీళ్లు పోయాలి.  కొద్దిగా నూనె, ఉప్పు వేసి మరిగించాలి.
  2. నీళ్లు మరుగుతున్న సమయంలో రవ్వ వేస్తూ కలపాలి. రవ్వ ఉడికిన తరువాత దింపి ఒక బౌల్‌లోకి మార్చాలి.
  3. తరువాత అందులో అరకప్పు గోధుమపిండి, అర టీస్పూన్‌ కారం, జీలకర్రపొడి, వాము, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక స్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు వేసి మెత్తటి మిశ్రమంలా కలపాలి. కొద్దిగా నూనె వేసి కలిపి పక్కన పెట్టాలి. 
  4. ఇప్పుడు పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ చపాతీలా చేసుకోవాలి.
  5. పెనంమీద నూనె వేసుకుంటూ రవ్వ పరోటాను రెండు వైపులా కాల్చాలి.




ఎగ్‌ పరోటా


కావలసినవి

గోధుమపిండి - రెండు కప్పులు, కోడిగుడ్లు - రెండు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - చిటికెడు, కొత్తిమీర - ఒకకట్ట, గరంమసాలా - అర టీస్పూన్‌.


తయారీ

  1. ఒక పాత్రలో గోధుమపిండి తీసుకొని అందులో ఉప్పు, కొద్దిగా నూనె, ఒక కప్పు నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. నీళ్లు కావాలంటే అదనంగా పోసుకోవచ్చు.
  2. తరువాత మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని చపాతీలా చేయాలి. మూలలు దగ్గరకు మలిచి మళ్లీ చపాతీలా చేయాలి. అలా నాలుగైదు సార్లు రిపీటెడ్‌గా చేయాలి. 
  3. మరొక పాత్రలో కోడిగుడ్లు వేసి అందులో ఉల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర, గరంమసాలా, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
  4. ఇప్పుడు పరోటాను పెనంపై కొద్దిగా కాల్చాలి. రెండువైపులా కాస్త నూనె పెట్టి కాల్చిన తరువాత ఒకవైపు కత్తితో కట్‌ చేసి పరోటాను తెరవాలి. 
  5. అందులో కోడిగుడ్డు మిశ్రమాన్ని పోసి, స్పూన్‌తో నెమ్మదిగా ఒత్తుతూ పరోటాను మూయాలి.
  6. ఇప్పుడు కాస్త నూనె అద్దుతూ రెండు వైపులా పరోటాను కాల్చాలి.

మొఘలాయి పరోటా


కావలసినవి

మైదా - రెండు కప్పులు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - నాలుగు, అల్లంవెల్లుల్లి పేస్టు  ఒక టీస్పూన్‌, క్యాప్సికం - ఒకటి, క్యారెట్‌ - రెండు, పసుపు - పావు టీ స్పూన్‌,  కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, జీలకర్ర పొడి - పావు టీస్పూన్‌, మామిడికాయపొడి - అర టీస్పూన్‌, గరంమసాలా - పావు టీస్పూన్‌, పనీర్‌ - 100 గ్రాములు. 


తయారీ

  1. ఒకబౌల్‌లో మైదా తీసుకుని, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా కలపాలి. కాస్త నూనె కోటింగ్‌లా పూసి మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టాలి.
  2. స్టవ్‌పై పాన్‌ పెట్టి కాస్త నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి.
  3. తరువాత క్యాప్సికం, క్యారెట్‌లను సన్నగా తరిగి అందులో వేయాలి. మరికాసేపు వేగించాలి.
  4. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మామిడికాయపొడి, గరం మసాలా తగినంత ఉప్పు వేసి కలపాలి.
  5. కాసేపయ్యాక సన్నగా కట్‌ చేసుకున్న పనీర్‌ వేసి కలపాలి. అంతే.. స్టఫ్‌ రెడీ.
  6. ఇప్పుడు మెత్తగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ చపాతీ కన్నా వెడల్పుగా చేయాలి.
  7. మధ్యలో పనీర్‌ స్టఫ్‌ పెట్టి నాలుగు వైపులా చపాతీని దగ్గరకు మూసి చేత్తో నెమ్మదిగా ఒత్తాలి.
  8. వీటిని పాన్‌పై నూనె వేసుకుంటూ చిన్నమంటపై రెండు వైపులా కాల్చాలి. క్రిస్ప్‌గా, గోధుమ రంగులోకి మారే వరకు కాల్చితే నోరూరించే పనీర్‌ స్టఫ్డ్‌ మొఘలాయి పరోటా రెడీ.



మేథీ పరోటా


కావలసినవి

మెంతి కూర - మూడు కట్టలు, సెనగపిండి - అరకప్పు, గోధుమపిండి - ఒక కప్పు, ఇంగువ - చిటికెడు, కారం - అర టీస్పూన్‌, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత. 


తయారీ

  1. మెంతి కూరను శుభ్రంగా కడిగి కట్‌ చేసి పెట్టుకోవాలి.
  2. ఒక పాత్రలో సెనగపిండి, గోధుమపిండి తీసుకోవాలి.
  3. అందులో మెంతి కూర, ఇంగువ, కారం, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
  4. ఈ మిశ్రమాన్ని పరోటాలుగా చేసుకుంటూ పెనంపై నెయ్యి వేస్తూ కాల్చాలి.
  5. రెండు వైపులా బాగా కాల్చిన తరువాత వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.




దాల్‌ పరోటా


కావలసినవి

గోధుమపిండి - అరకేజీ, సెనగపప్పు - ఒక కప్పు, కారం - అర టీస్పూన్‌, పసుపు - చిటికెడు, మామిడికాయ పొడి - అర టీస్పూన్‌, గరం మసాల - అర టీస్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, 


తయారీ

  1. గోధుమపిండిలో నీళ్లుపోసి మెత్తటి మిశ్రమంలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  2. సెనగపప్పును మూడు గంటల పాటు నానబెట్టుకుని, తరువాత మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. 
  3. పప్పు చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.
  4. అందులో పసుపు, కారం, మామిడికాయ పొడి, గరంమసాల, జీలకర్రపొడి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలుపుకొంటే స్టఫ్‌ రెడీ.
  5. గోధుమపిండిని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ వెడల్పాటి చపాతీలా చేసుకోవాలి.
  6. మధ్యలో దాల్‌ స్టఫ్‌ పెట్టి అన్ని వైపుల నుంచి దగ్గరకు మూయాలి.
  7. ఇప్పుడు నెమ్మదిగా చపాతీ కర్రతో మళ్లీ వెడల్పుగా చేసుకోవాలి. 
  8. పెనంపై నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుని వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-06-20T05:30:00+05:30 IST