పార్టీ సభ్యత్వమే శాశ్వతం
ABN , First Publish Date - 2022-02-02T05:04:23+05:30 IST
పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ పార్టీలో సభ్యత్వం మాత్రం శాశ్వతంగా ఉంటుందని మాజీ మంత్రి షబ్బీర్అలీ అన్నారు.
మాజీ మంత్రి షబ్బీర్అలీ
కామారెడ్డి, ఫిబ్రవరి 1: పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ పార్టీలో సభ్యత్వం మాత్రం శాశ్వతంగా ఉంటుందని మాజీ మంత్రి షబ్బీర్అలీ అన్నారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అఽధికారంలోకి వచ్చాక సభ్యత్వం ఉన్న వారికి సంక్షేమ పథకాలలో తొలి ప్రాధా న్యం ఉంటుందని చెప్పారు. సభ్యత్వాన్ని కార్డుగా భావించవద్దని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అంటే గౌరవమని అన్నారు. ఏఐసీసీ సూచనలకు అనుగుణంగా పార్టీ సభ్యత్వ నమోదును కార్యకర్తలు, నాయకులు షెడ్యూల్ ప్రకారం సభ్యత్వాలను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణ, మండల సభ్యత్వ నమోదుపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి షబ్బీర్అలీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకునే కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డు ఇవ్వడంతో పాటు రూ.2లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. షబ్బీర్అలీ 500 సభ్యత్వ నమోదు పూర్తి చేశారు. డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావుతో పాటు 20 మంది కార్యకర్తలు 500 సభ్యత్వ నమోదును పూర్తి చేశారని తెలిపారు. ఇసాయిపేట గ్రామానికి చెందిన ఎర్ర బాలయ్య, భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన కిరణ్ వెయ్యి మంది సభ్యత్వ నమోదును పూర్తి చేశారని తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,66,829 సభ్యత్వ నమోదును పూర్తి చేశారన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో 33,325 సభ్యత్వం నమోదు చేసి మొదటిస్థానంలో ఉందని అన్నారు. ఎల్లారెడ్డిలో 20,261, జుక్కల్లో 17,003, బాన్సువాడలో 15,492 సభ్యత్వం నమోదు చేశారన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పండ్ల రాజు, బద్దం ఇంద్రకరణ్రెడ్డి, గుడుగుల శ్రీనివాస్, షేర్ తదితరులు పాల్గొన్నారు.