ఇప్పుడు కాదు!.. గిరిజనులకు పట్టాల పంపిణీ వాయిదా
ABN , First Publish Date - 2020-08-09T17:48:24+05:30 IST
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు పెద్ద ఎత్తున..
అక్టోబరు 2న పంపిణీకి సన్నాహాలు
పార్వతీపురం(విజయనగరం): ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు పెద్ద ఎత్తున భూహక్కు పట్టాలు అందిస్తామని కొన్ని నెలలుగా ప్రభుత్వం చెప్పుకొస్తోంది. తాజాగా ఈ కార్యాక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ను కారణంగా చూపుతూ వాయిదా వేసింది. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తమకు పట్టాలు అందుతాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గిరిజనులు ఈ ప్రకటనతో నిరాశకు గురయ్యారు. పార్వతీపురం డివిజన్లో ఆర్వోఎఫ్ఆర్ పథకం కింద 6,287 కుటుంబాలకు 7,230 ఎకరాల అటవీ భూమికి పట్టాలు ఇవ్వనున్నట్టు, 6 వేల మంది గిరిజనులకు 6,188 ఎకరాల భూమికి డీకేటీ పట్టాలు అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఇటీవల ప్రకటించారు. ఈ నెల 9న (ఆదివారం) ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయడానికి అధికారులు ముహూర్తం నిర్ణయించారు. తాజాగా కరోనా కారణంగా అక్టోబరు 2వ తేదీకి వాయిదా వేశారు.