ఆ దాడులు నాపనే
ABN , First Publish Date - 2021-01-16T09:22:49+05:30 IST
‘‘రాష్ట్రంలోని వందలాది ఆలయాలపై నేనే దాడులు చేశాను. దేవతల విగ్రహాల తలలు నరికివేశాను. పలు విగ్రహాల భాగాలను ధ్వంసం
- హిందూ దేవుళ్ల విగ్రహాలు ఫేక్
- నా చేతులతో నేనే ధ్వంసం చేశా
- ఆలయాల్లో దాడులు చేయించాను
- పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
- అరెస్ట్ చేసిన సీఐడీ.. పోలీసులపై బౌన్సర్లతో దాడి
- ఓ మంత్రి, ఎంపీ, వైసీపీ నేతలతో ప్రవీణ్ చెట్టపట్టాలు!
కాకినాడ(ఆంధ్రజ్యోతి)/గుంటూరు, జనవరి 15: ‘‘రాష్ట్రంలోని వందలాది ఆలయాలపై నేనే దాడులు చేశాను. దేవతల విగ్రహాల తలలు నరికివేశాను. పలు విగ్రహాల భాగాలను ధ్వంసం చేశాను. చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మావాళ్లతో పలుచోట్ల ఇలాంటి దాడులు చేయించాను. దేవుళ్ల విగ్రహాలు ఫేక్. నా అసోసియేషన్లో 3,642 మంది ఫాస్టర్లు ఉన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 699 హిందూ గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చివేశాము. ఇంకా మరిన్ని గ్రామాలను ఇలాగే చేస్తాం.’’ ఇవి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు ప్రవీణ్ చక్రవర్తి (పాస్టర్ చక్రవర్తి) చేసిన వ్యాఖ్యలు. బెంగళూరుకు చెందిన గాసిప్ అనే యూట్యూబ్ చానల్లో ఆయన కొంతకాలంగా హిందూ మతానికి వ్యతిరేకంగా వాఖ్యలు చేస్తున్నారు.
ఇదికాకుండా ఈ ఏడాది జనవరి 11న అమెరికాలో ఓ క్రైస్తవ విరాళాలు ఇచ్చే దాతతో ఆన్లైన్లో మాట్లాడుతూ దేవుడి విగ్రహాలు ఫేక్. ఎన్నో విగ్రహాలు నా చేతులతో ధ్వంసం చేశాను అంటూ స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలపై వరుస దాడుల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గుంటూరుకు చెందిన సింగం వెంకట శ్రీలక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదు మేరకు.. మత విద్వేషాలు రెచ్చగొట్టారనే కారణంతో చక్రవర్తిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.అదుపులోకి తీసుకునే సమయంలో చక్రవర్తి బౌన్సర్లు సీఐడీ పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. క్రీస్తు విలేజ్ పేరుతో యూట్యూబ్లో విడుదల చేస్తున్న ప్రసంగాల గురించి ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఆయన విద్యాసంస్థల్లో తనిఖీ చేయనున్నట్లు తెలిసింది. కాగా, చక్రవర్తిని 3 రోజుల క్రితం అరెస్ట్ చేసినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఆయనపై తూర్పుగోదావర్లిలో ఇప్పటికే 4 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సైబర్ క్రైమ్ స్టేషన్, సీఐడీ విభాగంలో సైబర్ బుల్లిషీట్ తెరిచామన్నారు. చక్రవర్తిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ చెప్పారు.
విద్యాసంస్థల ముసుగులో...
చక్రవర్తి కొన్నేళ్లుగా క్రైస్తవ మత ప్రచారకుడిగా వ్యవహరిస్తున్నారు. విదేశాల నుంచి భారీస్థాయిలో అందుతున్న విరాళాలతో కాకినాడ, సామర్లకోటలో మదర్ థెరిస్సా పేరుతో పలు పాఠశాలలు, కేటీసీ చిల్డ్రన్ హోం, సిలోన్ బ్లైండ్ సెంటర్(ఎ్సబీసీ) నిర్వహిస్తున్నారు. వాకలపూడిలో శార్వాణి స్కూలును స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. సామర్లకోట మండలం ఉండూరులో 15ఎకరాల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ (పీవీఆర్ఎం) పేరుతో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకూ పలు విద్యాసంస్థలు నడుపుతున్నారు. బాలికల కోసం పలు విద్యాసంస్థలు ఏర్పాటు చేసి అనాథలు, నిరుపేదలు, ఇటుక బట్టీల కార్మికులను ఎంపిక చేస్తున్నారు. విద్యాభ్యాసం అనంతరం వీరిని క్రైస్తవ మతంలోకి మార్పిడి చేయిస్తున్నట్టు, దీనికోసం విదేశాల నుంచి పెద్దమొత్తంలో నిధులు తీసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. ఇక్కడ చదివిన బాలికలు ఎక్కడ ఉంటున్నారో ఎవరికీ తెలియదని చెబుతున్నారు. ఎస్బీసీలో అంధ విద్యార్థులు ఎవరూ లేరన్న విమర్శలున్నాయి.
ఎంత విలాసమో...
తనవద్ద పనిచేసే ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన చక్రవర్తి ఆమెను లోబర్చుకుని వదిలివేయడంతో బాధితురాలు అందోళనకు దిగింది. దీనిపై సర్పవరం పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తన రక్షణకు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 50మందికి పైగా బాడీగార్డులకు ఒక్కొక్కరికి నెలకు రూ.15-20వేల వరకూ చెల్లిస్తున్నట్టు సమాచారం. ఈయనకు ఏకంగా 16 కార్లు ఉన్నట్లు చెబుతారు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన మంత్రి కన్నబాబుకు తాను అనుచరుడిగా చక్రవర్తి చెప్పుకుంటాడు. మంత్రి నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో అధికారులను కూడా తన పలుకుబడితో బదిలీ చేయించారని సమాచారం. అలాగే కాకినాడ ఎంపీ వంగా గీత, పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ నేతలతోనూ చక్రవర్తి సన్నిహితంగా ఉంటాడని చెబుతున్నారు. రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామకు చెందిన చక్రవర్తి తల్లి జగ్గంపేటలో సాధారణ వార్డెన్. తండ్రి మెక్లారిన్ హైస్కూల్లో పీఈటీ. చక్రవర్తి బీదరికంలో పుట్టి అనతికాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తాడు. ఆయనకుఎటువంటి చర్చి లేదు. పాస్టర్ల సంఘంలో సభ్యత్వమూ లేదు. ఆయన ఆస్తి దాదాపు రూ.1,000 కోట్లు ఉంటుందని అంచనా. చక్రవర్తి బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ చేసి విదేశీ నిధులపై విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.