4వేలు ఫీజు కట్టలేదని.. పేషెంట్ను కొట్టి చంపారు!
ABN , First Publish Date - 2020-07-04T01:13:06+05:30 IST
అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి ఓ 4వేల రూపాయల ఫీజు కట్టలేదని ఆస్పత్రి సిబ్బంది కొట్టిచంపేశారు.
అలీగఢ్: అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి ఓ 4వేల రూపాయల ఫీజు కట్టలేదని ఆస్పత్రి సిబ్బంది కొట్టిచంపేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో చోటుచేసుకుంది. స్థానికంగా నివశించే ఓ వ్యక్తి అనారోగ్యంతో ఎన్బీ హాస్పిటల్లో చేరాడు. చికిత్స అనంతరం డిశ్చార్జి సమయంలో ఫీజు కట్టేటప్పుడు మృతుడి కుటుంబానికి ఆస్పత్రి సిబ్బందికి వాగ్వాదం జరిగింది. అప్పటికే తాను రూ.3,700 ఫీజు కట్టానని, కానీ ఎంట్రీ ఫీజు కింద మరో రూ.4వేలు కట్టాలని ఆస్పత్రి వర్గాలు చెప్పాయని మృతుడి మేనల్లుడు తెలిపారు. తన వద్ద అంత సొమ్ము లేదన్న అతను.. మెడిసిన్స్ కోసం వేసిన రూ.5వేలు కట్టడానికి సిద్ధపడినట్లు, అయినాసరే ఆస్పత్రి సిబ్బంది అంగీకరించలేదని సమాచారం. ‘చివరకు ఆ హాస్పిటల్లో పనిచేసే ఓ వ్యక్తి వచ్చి మమ్మల్ని బయటకు పిలిచాడు. అక్కడ అతను మమ్మల్ని ఎక్కడికీ వెళ్లకుండా అడ్డగించాడు. దీంతో అతన్ని వెనక్కి నెట్టా. అంతే కాసేపటికే ఇంకొందరు ఆస్పత్రి సిబ్బంది అక్కడకు చేరుకొని కర్రలతో దాడిచేశారు. ఈ ఘటనలో కొన్ని దెబ్బలు మా అంకుల్కు కూడా తగిలాయి. దాంతో ఆయన మృతిచెందారు’ అని మృతుడి మేనల్లుడు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.