ఫైబర్‌నెట్‌లో అక్రమాలంటూ తప్పుడు కేసులు: పట్టాభి

ABN , First Publish Date - 2021-09-14T17:52:42+05:30 IST

అమరావతి: ఏపీని ఫైబర్‌నెట్ రోల్‌ మోడల్‌ చేసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు.

ఫైబర్‌నెట్‌లో అక్రమాలంటూ తప్పుడు కేసులు: పట్టాభి

అమరావతి: ఏపీని ఫైబర్‌నెట్ రోల్‌ మోడల్‌ చేసిందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫైబర్‌నెట్‌ను ప్రశంసించిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వినూత్నమైన ఆలోచన నుంచి పుట్టిన ప్రాజెక్టు ఏపీ  ఫైబర్‌నెట్‌ అని, ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడ అమలుకాలేదన్నారు. ఇలాంటి కార్యక్రమానికి అప్పటి సీఎం నారా చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. అలాంటి ఫైబర్‌ నెట్‌లో అక్రమాలంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని, ప్రతిష్టాత్మక ఫైబర్‌ నెట్‌పై బురదజల్లే కార్యక్రమం జరుగుతోందని పట్టాభి మండిపడ్డారు.


ఫైబర్‌ నెట్‌లో అవినీతి జరిగిందని చెప్పే ప్రయత్నం జరుగుతోందని పట్టాభి అన్నారు. గత ప్రభుత్వంలో రూ.6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని అసత్యప్రచారం చేస్తున్నారని, ఏ ఒక్కటీ రుజువు కాకపోవడంతో జగన్‌ అసహనంతో ఉన్నారన్నారు. ఒకే కనెక్షన్‌తో రూ.149కే మూడు రకాల సేవలు అందించే ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టు అని, దేశమంతా ఈ విధానాన్ని అవలంబించాలని ప్రధాని మోదీ అభినందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అవినీతి జరిగిందంటున్న గౌతమ్‌రెడ్డి పైసా అవినీతిని కూడా నిరూపించలేకపోయారని పట్టాభి వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-09-14T17:52:42+05:30 IST