ఆనందబాబుకు నోటీసులు ఇవ్వడం దారుణం: పట్టాభి

ABN , First Publish Date - 2021-10-19T17:21:41+05:30 IST

మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని పట్టాభి అన్నారు.

ఆనందబాబుకు నోటీసులు ఇవ్వడం దారుణం: పట్టాభి

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న మధ్యాహ్నం మాదకద్రవ్యాలపై ఆనందబాబు మీడియా సమావేశంలో మాట్లాడితే అర్థరాత్రి పోలీసులు ఆనందబాబు ఇంటికి రావడంపై మండిపడ్డారు. నర్సీపట్నం నుంచి గుంటూరు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్నింట్లో ఇంత మెరుపువేగంగా పోలీసులు స్పందిస్తే బాగుండునన్నారు. పక్కనున్న ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతుంటే.. అక్కడికి వెళ్లే తీరికలేని పోలీసులు.. ఆనందబాబుకు నోటీసులు ఇవ్వడానికి మాత్రం నర్సీపట్నం నుంచి గుంటూరు ఆగమేఘాలమీద వచ్చారని మండిపడ్డారు. వేరే ఇతర కేసుల్లో ఇంత మేరుపు వేగంగా పోలీసులు పని చేస్తారా? అని ప్రశ్నించారు. అత్యాచారాలు, దళితులపై దాడులు జరిగితే మాత్రం పోలీసులు స్పందించరని పట్టాభి తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.


పోలీసులు అర్థరాత్రి టీడీపీ నేతల ఇళ్లముందుకు రావడం కాదని, ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడారో కాస్త ఇంగితంతో ఆలోచించుకుంటే మంచిదని పట్టాభి హితవుపలికారు. ఆనంద్ బాబు నిన్న మీడియాతో మాట్లాడినదానిలో తప్పేముందో నర్సీపట్నం పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనంద్ బాబుకు నోటీసులివ్వడంలోచూపిన మెరుపువేగం, గంజాయిసాగుని అరికట్టడంలో చూపితే బాగుండేదన్నారు. పైస్థాయి అధికారులు చెప్పారు కదా అని, కిందిస్థాయిలోఉన్న పోలీసులు శృతిమించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారందరూ భవిష్యత్‌లోచట్టపరంగా, న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని పట్టాభి హెచ్చరించారు.

Updated Date - 2021-10-19T17:21:41+05:30 IST