పరవాడ దుర్ఘటన బాధాకరం: పవన్
ABN , First Publish Date - 2020-06-30T21:04:57+05:30 IST
అమరావతి: పరవాడ ఫార్మా సిటీలో దుర్ఘటన బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అమరావతి: పరవాడ ఫార్మా సిటీలో దుర్ఘటన బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రసాయన పరిశ్రమల్లో తక్షణం సేఫ్టీ ఆడిట్ చేపట్టాలన్నారు. విశాఖపట్నం జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ఉన్న సాయినార్ లైఫ్ సైన్సెస్ సంస్థలో విష వాయువులు విడుదలై ఇద్దరు మృతి చెందారని, తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ వల్ల చోటు చేసుకున్న దుర్ఘటన ఇంకా కళ్ల ముందే ఉందన్నారు.
కొద్ది రోజుల కిందటే నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లో విష వాయువు వెలువడి ఒకరు మృత్యువాతపడ్డారన్నారు. ఇంతలోనే సాయినార్ సంస్థలో విష వాయువులకు ఇద్దరు బలి కావడం బాధాకరమని పవన్ వాపోయారు. మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రాష్ట్రంలోని రసాయన పరిశ్రమల్లో రక్షణ చర్యలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జనసేన చెబుతూనే ఉందన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని పవన్ ప్రశ్నించారు.
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ఉన్నతాధికారులతో చేపట్టిన విచారణలో కూడా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని రసాయన పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ ఆడిట్ చేపట్టాలన్నారు. నిబంధనలు పాటించకుండా ఉద్యోగులు, సమీప ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకొంటున్న ఈ తరహా ప్రమాదాలపై నిపుణుల కమిటీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల ప్రమాద ఘటనల్లో మృతి చెందినవారికి అందరికీ ఆమోదయోగ్యమైన పరిహారం ఇచ్చి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.