కదిలే ప్రసక్తే లేదు.. వర్షంలోనే Pawan Kalyan నిరసన

ABN , First Publish Date - 2021-10-02T19:20:21+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన ‘శ్రమదానం’ కార్యక్రమం తీవ్ర ఉద్రికత్తంగా మారింది...

కదిలే ప్రసక్తే లేదు.. వర్షంలోనే Pawan Kalyan నిరసన

కాకినాడ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన ‘శ్రమదానం’ కార్యక్రమం తీవ్ర ఉద్రికత్తంగా మారింది. సేనాని కార్యక్రమానికి, బహిరంగ సభకు పోలీసులు అనుమతివ్వలేదు. అయితే అనుమతి ఎలా ఇవ్వరో చూద్దాం.. కార్యక్రమం జరిపి తీరుతామని కార్యకర్తలు, అభిమానులు, పవన్ మొండిగా రంగంలోకి దిగారు. ఇవాళ ఉదయం నుంచే తూర్పుగోదావరి జిల్లాలో పలువురు జనసేన నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు పవన్  రాజమహేంద్రి ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, నేతలు రాగా వారిని సైతం అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు.. పవన్ ఫ్యాన్స్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.


తగ్గేదేలే..

ఈ విషయం తెలుసుకున్న పవన్.. ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూ పోలీసులకు సవాల్ విసిరారు. దీంతో అభిమానులు ఈలలు, కేకలతో హోరెత్తించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సభకు అనుమతివ్వలేదని పోలీసులు.. ఎలా ఇవ్వరో.. తాము అనుకున్నది సాధించి తీరుతామని పవన్ శపథాలు చేసుకున్నంత పనైంది. మరోవైపు సభ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. అయినప్పటీకీ పవన్ వెనక్కి తగ్గకుండానే వర్షంలో నిలబడే పోలీసుల తీరును తప్పుబడుతూ పవన్ నిరసనకు దిగారు. తనతో వచ్చే ర్యాలీ వాహనాలకు అనుమతి ఇవ్వకపోవడంపై కూడా పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి అనుమతి ఇచ్చేవరకూ ఇక్కడ్నుంచి ‘కదిలేది లేదు’ అని పవన్ అక్కడే నిలబడ్డారు.


శ్రమదానం పూర్తి..

మరోవైపు.. వర్షం ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టింది. కాసేపట్లో సభా ప్రాంగణానికి పవన్ చేరుకోనున్నారు. ఆయన ప్రసంగం కోసం వేలాదిగా వచ్చిన అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఎదురుచూస్తున్నారు. అంతకుముందు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జనసేన చేపట్టిన శ్రమదానం కార్యక్రమాన్ని పవన్ పూర్తి చేశారు. గుంతలు పడ్డ రోడ్డును పవన్ పూడ్చారు. దీంతో పవన్ ధరించిన దుస్తులు బురద అంటుకుంది. 


అనుమతి ఎందుకివ్వలేదు..!

పవన్‌ రాకతో అత్యధికంగా జనం వస్తారని, బ్యారేజీపై ఇబ్బంది అవుతుందని పోలీసులు కూడా చెప్పడంతో పవన్‌ శ్రమదానం బ్యారేజీపై విరమించుకున్నారు. హుకుంపేట సమీపంలోని బాలాజీపేటలో అధ్వానంగా తయారైన రోడ్డుకు శ్రమదానం చేయడానికి జనసేన నిర్ణయించింది. మరోవైపు ఇక్కడ కూడా అధికారులు హడావుడిగా గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టడం విశేషం.

Updated Date - 2021-10-02T19:20:21+05:30 IST