రైతుల మేలు కోసమే బీజేపీ సర్కార్‌ కొత్త చట్టం: పవన్‌

ABN , First Publish Date - 2020-12-03T22:21:37+05:30 IST

రైతుల మేలు కోసమే బీజేపీ సర్కార్‌ కొత్త చట్టం తీసుకొచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

రైతుల మేలు కోసమే బీజేపీ సర్కార్‌ కొత్త చట్టం: పవన్‌

తిరుపతి: రైతుల మేలు కోసమే బీజేపీ సర్కార్‌ నూతన వ్యవసాయ చట్టం తీసుకొచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌  అన్నారు. గురువారం తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను జనసేన నాయకులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ చట్టంతో రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని తెలిపారు. రైతులను బలోపేతం చేయడం.. వారికి కొత్త అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా సంస్కరణలు  తేవడానికే  ప్రధానమంత్రి మోదీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని  వ్యాఖ్యానించారు. రైతుల కిసాన్ బిల్లులో సవరణకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.  కొంతమంది కావాలని ఈ చట్టంపై రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను కేంద్రం పరిష్కరిస్తుందని చెప్పారు.


రైతు సంక్షేమాన్ని మరిచిన జగన్

రైతు సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారిని ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. వరదల్లో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని అన్నారు. రైతులకు తుపాన్‌ నష్టపరిహారం రూ.35 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని చెప్పారు.   పంటనష్టంపై నివేదిక తయారు చేసి సాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామని అన్నారు. మద్యం, ఇసుకలో ప్రభుత్వం ఎంతో గడిస్తోందని.. రైతుల సమస్యలను  మాత్రం పరిష్కరించడంలో  అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు.  జైకిసాన్‌ పేరుతో రైతుల కోసం కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. రైతులకు అండగా ఉండేలా ఒక ప్రణాళికతో ముందుకెళ్తానని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కాదు.. లాభసాటి ధర రావాలని చెప్పారు.

Updated Date - 2020-12-03T22:21:37+05:30 IST