పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి
ABN , First Publish Date - 2021-06-18T05:02:03+05:30 IST
మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణపై అధికారులు, కౌన్సిల్ ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ రాజర్షిషా అన్నారు.
లోతట్టు ప్రాంతాలను మొరంతో నింపండి
అదనపు కలెక్టర్ రాజార్షి షా
సంగారెడ్డి రూరల్/నారాయణఖేడ్/కోహీర్/జహీరాబాద్, జూన్ 17 : మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణపై అధికారులు, కౌన్సిల్ ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉదయం పట్టణంలోని రైతుబజార్, మార్కెట్యార్డును ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కూరగాయల విక్రయదారులతో మాట్లాడి ఏవైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. మార్కెట్యార్డులో లోతట్టు ప్రాంతాలను వెంటనే మొరంతో నింపాలని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్కు సూచించారు. అనంతరం సంగారెడ్డి పట్టణ శివారులోని పోతిరెడ్డిపల్లి రోడ్డు నంబరు 2లో గల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలుస్తున్నదని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు ఆ కాలనీలో సందర్శించారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద మురుగుకాలువ మార్గం వర్షాకాలంలో నీటి ప్రవాహానికి సరిపోవడం లేదని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ లతావిజయేందర్రెడ్డి, కౌన్సిలర్ రామప్ప అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కాలువ పనులకు రూ.5 లక్షలు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్రెడ్డి, మేనేజర్ మీర్జా అలీబేగ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వర్షాకాలంలో జాగ్రత్తగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ గోపు మల్లారెడ్డి సిబ్బందికి సూచించారు. నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని అన్నివిభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ మేనేజర్ గంగాధర్, శానిటేషన్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రతిరోజూ గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టాలని ఎంపీడీవో సుజాతనాయక్ సూచించారు. కోహీర్ మండల పరిధిలోని పిచేర్యాగడితండా, పర్శపల్లి గ్రామాలను సందర్శించి పారిశుధ్య పనులను, పల్లె ప్రకృతివనాలను, నర్సరీలను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి సందీ్పకుమార్, సర్పంచ్ తారాబాయ్ పాల్గొన్నారు. గ్రామాల పరిశుభ్రతపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జడ్పీ సీఈవో ఎల్లయ్య పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన మొగుడంపల్లిలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవోలు రాములు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.