భవన నిర్మాణాలకు త్వరలో బిల్లుల చెల్లింపులు

ABN , First Publish Date - 2021-12-04T05:57:38+05:30 IST

వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన భవన నిర్మాణాలకు త్వరలోనే బిల్లులు చెల్లింపు జరుగుతాయని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ అన్నారు.

భవన నిర్మాణాలకు త్వరలో బిల్లుల చెల్లింపులు
ఐసీడీఎస్‌ గోదాంలో సరకుల వివరాలను సీడీపీవోకు అడుగుతున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ


పీఆర్‌ కమిషనర్‌ కోన శశిధర్‌ 

పాడేరు, డిసెంబరు 3: వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన భవన నిర్మాణాలకు త్వరలోనే బిల్లులు చెల్లింపు జరుగుతాయని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ అన్నారు. అమరావతి నుంచి జేసీలు,  ఐటీడీఏ పీవోలు, జడ్పీ సీఈవోలు, పంచాయతీ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 15వ ఆర్థిక సంఘం పేరున సర్పంచులు బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలన్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణాలు వేగంగా పూర్తిచేయాలని, వాటికి అప్రోచ్‌ రోడ్లు  నిర్మించాలని ఆదేశించారు. సచివాలయ భవనాలు నిర్మించే దగ్గర సామాజిక మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. శుక్రవారం నుంచి సిమెంట్‌ సరఫరా జరుగుతుందన్నారు. అలాగే రాష్ట్రప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా కేంద్రాలు, సచివాలయం భవనాలు, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లు నిర్మాణాల పనులు ప్రారంభించాలన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ మాట్లాడుతూ.. ఏజెన్సీలో 212 సచివాలయ భవనాలకు 80 భవనాలు పూర్తయ్యా యన్నారు. బిల్లు ఆలస్యం కావడంతో ఆయా భవనాలను అప్పగించేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రావడం లేదని, సిమెంట్‌ సమస్యను కమిషనర్‌ దృష్టికి తెచ్చారు. భవన నిర్మాణాలకు త్వరలోనే బిల్లుల చెల్లింపులు జరుగుతాయని కమిషనర్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, ఉపాధి హామీ ఏపీడీ గిరిబాబు పాల్గొన్నారు.

ఐటీడీఏ స్పందనకు 45 వినతులు 

స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందనలో గిరిజనులు నుంచి 45 వినతులు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌ స్వీకరించారు. హుకుంపేట మండలం మర్రిపుట్టు గ్రామానికి చెందిన జి.మత్స్యరాజు ఉపాధి వేతనాలు చెల్లించాలని కోరగా, పాడేరు మండలం కొత్తపాడేరుకి చెందిన పాంగి దేవయ్య వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. అరకులోయ మండలం కొత్త భల్లుగూడ గ్రామస్థులు ఎస్‌.అర్జున్‌, డి.రామన్న కొత్తభల్లుగూడ సమీపంలోని గెడ్డ వద్ద అక్రమంగా టెంట్లు నిర్వహిస్తున్నారని, తొలగించాలని ఫిర్యాదు చేశారు.  

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

తుఫాన్‌ నేపథ్యంలో ఏజెన్సీలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏజెన్సీ అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ  డీడీ జి.విజయకుమార్‌, ఎస్‌ఈ ఎస్‌.శ్రీనివాస్‌, ఈఈ డీవీఆర్‌ఎం.రాజు, పీఆర్‌ ఈఈ ఎం.కొండయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరరావు, తదితరులు పాల్గొన్నారు. 

పోషణ కిట్లు సకాలంలో పంపిణీ చేయండి 

అంగన్‌వాడీ లబ్ధిదారులైన గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న సంపూర్ణ పోషణ కిట్‌లను సకాలంలో పంపిణీ చేయాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు. మండలంలోని చింతలవీధి పంచాయతీ భీమసింగిలో ఉన్న ఐసీడీఎస్‌ గోదామును శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. పాలు, గుడ్లు, ఖర్జూరం, రాగి, గోధుమ పిండి నిల్వలను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోషకాహార నిల్వలను అంగన్‌వాడీ కేంద్రాలకు వెంటనే తరలించి లబ్ధిదారులకు సకాలంలో పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో స్థానిక సీడీపీవో లలితకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-12-04T05:57:38+05:30 IST