పెగాసస్ వివాదం: సుప్రీం విచారణ వాయిదా

ABN , First Publish Date - 2021-09-07T19:04:12+05:30 IST

పెగాసిస్ స్నూపింగ్ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణను ఈనెల 13వ తేదీకి సుప్రీంకోర్టు..

పెగాసస్ వివాదం: సుప్రీం విచారణ వాయిదా

న్యూఢిల్లీ: పెగాసస్ స్నూపింగ్ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణను ఈనెల 13వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కేంద్రం మరింత గడువు కోరడంతో విచారణ వాయిదా పడింది. తమ అధికారులు కొంతమంది అందుబాటులో లేకపోవడంతో అఫిడవిట్ తయారీలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, గురువారం వరకూ కొద్దిపాటి గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు.


దీనికి ముందు, జాతీయ భద్రతతో ముడిపడిన అంశమైనందున పబ్లిక్ అఫిడవిట్‌లో వివరాలు ఇవ్వలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. నిపుణులతో కూడిన ఇండిపెండెంట్ కమిటీ ముందు అన్ని విషయాలు వెల్లడిస్తామని, ఆ తర్వాత కమిటీ కోర్టుకు నివేదిక అందిస్తుందని తెలిపింది. దీనిపై సీజేఐ ఎన్.రమణతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ, తాము చర్చించి, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. గత నెలలో కేంద్రం టూకీగా ఒక అఫిడవిట్‌ను సమర్పించింది. పిటిషనర్లు చేసిన ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్నట్టు తెలిపింది. స్వప్రయోజనాలు ఆశించే చేసే తప్పుడు ప్రచారాలను, అపోహలను తొలగించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. పెగాసస్ వివాదంపై ఇప్పటికే ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో వివరణ ఇచ్చారని తెలిపింది. పెగాసస్ స్నూపింగ్ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాతో సహా పలు పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

Updated Date - 2021-09-07T19:04:12+05:30 IST