వ్యాపారుల పేరుతో రాజకీయాలు వద్దు

ABN , First Publish Date - 2020-06-05T10:37:42+05:30 IST

కరోనా కేసులతో కంటైన్మెంట్‌ జోన్‌లో ఉన్న నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలో దుకాణాలు తెరిచేందుకు అధికార పార్టీ నేతలు ..

వ్యాపారుల పేరుతో రాజకీయాలు వద్దు

సన్నపురెడ్డి పెంచలరెడ్డి


నెల్లూరు (జడ్పీ), జూన్‌ 4 : కరోనా కేసులతో కంటైన్మెంట్‌ జోన్‌లో ఉన్న నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలో దుకాణాలు తెరిచేందుకు అధికార పార్టీ నేతలు డబ్బు డిమాండ్‌ చేశారని జరుగుతున్న ప్రచారం అసత్యమని, వ్యాపారుల పేరుతో రాజకీయం చేయవద్దని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ట్రేడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సన్నపరెడ్డి పెంచల్‌రెడ్డి కోరారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టోన్‌హౌస్‌పేటలోని రెండు కుటుంబాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. దీంతో అధికారులు కంటైన్మెంట్‌ నిబంధనలు అమలు చేస్తున్నారన్నారు. అలాగే వ్యాపారులు సైతం ధైర్యంగా షాపులు తీసుకునే పరిస్థితి లేదని చెప్పారు. అయితే అధికార పార్టీ నేతలకు డబ్బు ఇవ్వలేదని, అందుకోసమే షాపులు తీయడం లేదని కొంత మంది ఖాళీగా ఉన్న రాజకీయ నాయకులు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.


చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ట్రేడ్‌ జిల్లా ఆధ్యక్షుడు దాసా లక్ష్మీ నారాయణ, శ్రీవాసవి కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ ఆఽధ్యక్షుడు మంచికంటి శ్రీనివాసులు, సింహపురి వాణిజ్య మండలి ఆధ్యక్షుడు శ్రీరామ్‌ సురేష్‌ మాట్లాడుతూ స్టోన్‌హౌస్‌పేటలో వచ్చిన రెండు కరోనా కేసులకు సంబంధించి ఈనెల 8వ తేదీకి క్వారంటైన్‌ పూర్తి అవుతుందని, 9వ తేదీ నుంచి దుకాణాలు తీసుకోవచ్చని అధికారులు తెలిపారన్నారు. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌పై బురద చల్లేందుకు కొంత మంది ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఈ సమావేశంలో దాల్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకుడు పెసల నరసింహ స్వామి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T10:37:42+05:30 IST