అధికారుల నిర్లక్ష్యంతోనే పరిహారం పెండింగ్
ABN , First Publish Date - 2021-03-03T06:49:35+05:30 IST
అధికారుల నిర్లక్ష్యమే తమకు పం నష్టపరిహారం అందకపోవటానికి కారణమని వీరులపాడు మండలం కొణతాలపల్లి, పల్లెంపల్లి రైతులు.. విచారణ అధికారుల ఎదుట వాపోతున్నారు.
వీరులపాడు మండల రైతుల ఆవేదన
వీరులపాడు, మార్చి 2 : అధికారుల నిర్లక్ష్యమే తమకు పం నష్టపరిహారం అందకపోవటానికి కారణమని వీరులపాడు మండలం కొణతాలపల్లి, పల్లెంపల్లి రైతులు.. విచారణ అధికారుల ఎదుట వాపోతున్నారు. వీరులపాడు మండలం కొణతాలపల్లిలో నివర్ తుఫాను పంట నష్టపరిహారంలో అవకతవకలు జరిగాయంటూ సోమవారం రైతులు చేసిన ఆందోళనలో భాగంగా మంగళవారం ఉదయం గ్రామంలో విచారణ చేపట్టేందుకు జాయింట్ డైరెక్టర్ మోహన్రావు మంది అధికారులతో కలిసి గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వద్దకు వచ్చారు. 140 మంది రైతులకు సంబంధించి విచారణ చేపట్టారు. వీరిలో సుమారు 20మందికిపైగా నకిలీ రైతులు ఉన్నారని, వారికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్, వ్యవసాయశాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీతోపాటు వ్యవసాయశాఖ మంత్రికి అందించనున్నట్లు తెలిపారు. దీనిపై జాయింట్ డైరెక్టర్ మోహన్రావు మాట్లాడుతూ గ్రామంలో 224 మంది రైతులకుగానూ 410 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు మండల వ్యవసాయాధికారి నివేదిక అందించారు. దానిలో 130 మంది రైతులకుగానూ 206 ఎకరాలకు రూ.12.36 లక్షలు మాత్రమే వారి ఖాతాల్లో నగదు జమ అయిందని, దీనిలో 94 మంది రైతులకు పరిహారం రావాల్సి ఉందన్నారు. కానీ మండల వ్యవసాయాధికారి వరికి మాత్రమే పంట నష్టపరిహారం నమోదు చేస్తున్నారని, పత్తి, మిర్చికి నమోదు చేయటం లేదని రైతులు వాపోయారు. మండల వ్యవసాయాధికారి, స్థానిక రైతు భరోసా కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తాము అన్ని రకాలుగా నష్టపోయినట్లు రైతులు జేడీఏ ఎదుట ఆందోళనకు దిగారు. నిన్న జరిగిన ఆందోళనలో సైతం వరికి మాత్రమే నమోదు చేశామని ఏవో గింజుపల్లి రమేష్ పేర్కొన్నారని, మంగళవారం జరిగిన విచారణలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు కూడా పరిహారం నమోదు చేశామంటూ చెప్పటం వల్ల మరింత నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విచారణలో నందిగామ ఏడీఏ రమణమూర్తి, తిరువూరు ఏడీఏ కెనడీ పాల్గొన్నారు.