పెన్నా సిమెంట్స్ పబ్లిక్ ఇష్యూకు సెబీ ఓకే
ABN , First Publish Date - 2021-10-19T08:11:13+05:30 IST
పెన్నా సిమెంట్స్ పబ్లిక్ ఇష్యూకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,550 కోట్లు సమీకరించనుంది.
రూ.1,550 కోట్ల సమీకరణ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): పెన్నా సిమెంట్స్ పబ్లిక్ ఇష్యూకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,550 కోట్లు సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా రూ.1,300 కోట్లను తాజా షేర్లను జారీ చేయడం ద్వారా సమీకరించనున్నారు. ప్రస్తుతం కంపెనీ ప్రమోటరైన పీఆర్ సిమెంట్ హోల్డింగ్స్ రూ.250 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. పెన్నా సిమెంట్లో పీఆర్ సిమెంట్ హోల్డింగ్స్కు 33.41 శాతం వాటా ఉంది. తాజా షేర్లను జారీ చేయడం ద్వారా లభించే నిధులలో రూ.550 కోట్ల రుణాలు చెల్లించేందుకు వినియోగించనుంది. కాగా రూ.105 కోట్లతో ప్లాంట్ల సామర్థ్య విస్తరణను చేపట్టనుంది. రూ.80 కోట్లను గ్రైండింగ్, సిమెంట్ మిల్లు నవీకరణకు, రూ.240 కోట్లు వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్లపై వినియెగించనున్నట్లు సెబీకి సమర్పించిన పత్రాల్లో కంపెనీ పేర్కొంది. 1991లో పీ ప్రతాప్ రెడ్డి, పీఆర్ సిమెంట్ హోల్డింగ్స్ పెన్నా సిమెంట్ను ఏర్పాటు చేశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో కంపెనీకి నాలుగు సిమెంట్ తయారీ, రెండు గ్రైండింగ్ యూనిట్లు ఉన్నాయి. కాగా 2019 మేలో శ్రీలంకకు చెందిన సింఘా సిమెంట్ను కొనుగోలు చేసింది. 2020-21లో కంపెనీ ఆదాయం రూ.2,476 కోట్లుగా ఉంది.