పెన్సన్.. టెన్షన్
ABN , First Publish Date - 2020-03-30T10:54:55+05:30 IST
వారంతా ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులే.. 30 నుంచి 40 ఏళ్ల పాటు కీలకమైన వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో విధులు నిర్వహించిన వారే..
ఆందోళనలో ఏఎంసీల పింఛనుదారులు
రెండు నెలలుగా ఇదే దుస్థితి
పట్టించుకోని అధికారులు, పాలకులు
(విజయగరం రూరల్)
వారంతా ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులే.. 30 నుంచి 40 ఏళ్ల పాటు కీలకమైన వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో విధులు నిర్వహించిన వారే.. రిటైర్ కావడంతో ప్రస్తుతం పింఛనుతో బతుకుతున్నారు. నెలానెలా ఠంఛన్గా రావాల్సిన పింఛను రెండు నెలలుగా అందడం లేదు. అసలే కర్ఫ్యూ కాలం కావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని ఏఎంసీల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన దాదాపు 93 మంది వృద్ధుల పరిస్థితి ఇదీ.
వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేసే ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల ఒకటినే జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి మేసేజ్ వస్తుంది. ఏఎంసీల్లో పనిచేసి రిటైర్ అయిన వీరికి మాత్రం రావడం లేదు. నెలలో ఏ రోజు పెన్షన్ ఇస్తారో తెలియని పరిస్థితి. గతంలో కూడా సకాలంలో పింఛను అందుకున్నది లేదు. వీరు ప్రభుత్వ ఆధ్వర్యంలో వున్నావారే కాని గ్రాంట్ ద్వారా పెన్షన్ చెల్లించే విధానం అమల్లో ఉంది. ఈ విధానాన్ని తీసేసి అందరి ప్రభుత్వ పెన్షనర్ల మాదిరిగా తమకు కూడా పెన్షన్ ఇవ్వాలని వీరు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమస్యపై వినతి తీసుకోని ప్రజాప్రతినిధి కాని, అధికారి కాని లేరంటే అతిశయోక్తి కాదు. అయినా పరిష్కారం కాక పెన్షన్ కోసం ప్రతి నెలా టెన్షన్ పడుతున్నారు. ఇంత వరకూ రెండు నెలల పెన్షన్ వీరికి అందలేదు. మార్చి నెల పెన్షన్ ఏప్రిల్ నెలలో అందాల్సి ఉంది. ఏప్రిల్ నెల వస్తే వీరికి మూడు నెలల పెన్షన్ అందనట్టే! మరో రెండు రోజుల్లో మార్చి నెల కూడా ముగియనుంది. దీంతో పెన్షనర్లు లబోదిబోమంటున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వీరి ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. అందరూ 60 నుంచి 70 ఏళ్లు దాటినవారే. మందులు ఇతరత్రా అవసరాలకు పెన్షన్ అందకపోవడంతో చాలా బాధ పడుతున్నారు. జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో దాదాపు 93 మంది వరకూ పెన్షనర్లు ఉన్నారు. ఏఎంసీల అధికారులు, పాలకవర్గాలు దీనిపై ఆలోచన చేసి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్నారు.
పెన్షన్ను అందించాలి
రెండు నెలలుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వలేదు. దీని గురించి అధికారులను సంప్రదిస్తే ఆదేశాలు వస్తే వెంటనే ఇచ్చేందుకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. ప్రతినెలా పెన్షన్ ఇవ్వకపోతే ఇబ్బందే కదా! అరవై ఏళ్లు దాటిన నేపథ్యంలో మందులు కూడా అవసరం అవుతాయి. మా ఇబ్బందులపై వెంటనే అధికారులు, పాలకవర్గం స్పందించాలి.
- కాళ్ల సన్యాసి, మార్కెట్ కమిటీ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు